కరీంనగర్/జగిత్యాల/పెద్దపల్లి, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాను రెండు రోజులుగా ముసురు పట్టుకున్నది. మంగళవారం రాత్రి నుంచి రెండురోజులగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నా యి. ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి తెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. బుధవారం ఉద యం జిల్లాలో సగటు వర్షపాతం 3.5 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా గంగాధర మండలంలో 86.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. చొప్పదండిలో 49.2, రామడుగులో 41.6, కరీంనగర్లో 39.2, తిమ్మాపూర్లో 38.2, శంకరపట్నంలో 29.2, వీణవంకలో 27.8, జమ్మికుంటలో 22.8, సైదాపూర్లో 22.6, హుజూరాబాద్లో 22.4, చిగురుమామిడిలో 21.6, మానకొండూర్లో 19.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షాల కారణంగా చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. అనేక గ్రామాల్లో ఇప్పటికే చెరువులు, కుంటలు 50శాతానికిపైగా నీళ్లతో నిండి ఉన్నా యి. మాననొండూర్ మండలం శ్రీనివాస్నగర్లోని బర్లాం చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. మత్తడి పడడంతో మత్స్యకారులు చేపలు పడు తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబా ద్ గుండ్ల చెరువు మత్తడి దుంకుతుండగా పలువురు ఆసక్తిగా మత్తడిని తిలకించారు. రంగనాయకులగుట్ట వద్ద చిలుకవాగు దాటనీయకపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.
జగిత్యాల జిల్లాలో..
జగిత్యాల జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు 55.35మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కథలాపూర్లో 94.6 మిల్లీ మీటర్లు, మల్లాపూర్లో 921.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాలలో 50.6మిల్లీమీటర్లు, రాయికల్లో 52.2, ధర్మపురిలో 43.2, సారంగాపూర్లో 52.4, గొల్లపల్లిలో 52.4, పెగడపల్లిలో 53.2, కొడిమ్యాలలో 44.2, వెల్గటూర్లో 41.2, కోరుట్లలో 66.4, మేడిపల్లిలో 41.4, మెట్పెల్లిలో 64, ఇబ్రహీంపట్నంలో 52.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మల్యాలలో అత్యల్పంగా 31మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు పడ్డాయి. సుమారు జిల్లా వ్యాప్తంగా 20మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల మండలం మోరపల్లి గ్రామానికి చెందిన ఆగునూరి లింగయ్యకు చెంది న ఇంటి పైకప్పు వర్షానికి కూలింది. కొడిమ్యాల మండల కేంద్రం నుంచి నాచుపల్లి వేళ్లేదారిలో ఉన్న చిలుకవాగు ఉప్పొంగి ప్రవహించడంతో జగిత్యాల, కొండగట్టుకు రాకపోకలు నిలిచాయి. కోరుట్ల పట్టణంలోని జవహర్ రోడ్డు బ్రిలియంట్ స్కూల్ సమీపంలో బుధవారం చెట్టు విరిగిపడింది. ఈఘటనలో చెట్టుకొమ్మలు పక్కనే ఉన్న విద్యుత్ పోల్ తీగలపై పడడంతో పోల్ విరిగిపోయింది. మేడిపల్లి మండలంలోని లింగపేట చెరు వు 15 ఏళ్ల తర్వాత మత్తడి దుంకింది. కథలాపూ ర్ మండలంలోని బొమ్మెన ప్రాజెక్టు 11 ఏండ్ల త ర్వాత పూర్తిగా నీరు నిండి మత్తడి దుంకుతున్నది.
పెద్దపల్లి జిల్లాలో..
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 5.79 సెంటిమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా జూలపల్లి మండలంలో 5.79 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా రామగిరిలో 4.58 సెంటీమీటర్ల వాన కురిసింది. పెద్దపల్లిలో 6.72, సుల్తానాబాద్లో 6.70, ఓదెలలో 6.12, కాల్వశ్రీరాంపూర్ 5.685, ఎలిగేడులో 5.64, ధర్మారంలో 5.62, ముత్తారంలో 5.46, మంథనిలో 4.98, కమాన్పూర్లో 4.92 సెంటీమీటర్లు కురిసింది.
కనువిందు చేస్తున్న ‘రాముని గుండాల ’
జ్యోతినగర్(రామగుండం), జూలై 21: రామగుండం మండల కేంద్రంలోని శ్రీరామ పాదక్షేత్రంలోని రాముని గుండాల్లో జలపాతం కనువిందు చేస్తున్నది. ఎత్తైన కొండ నుంచి జలపాతం రాముని గుండాలకు చేరడంతో సందర్శకులు తిలకించి సెల్ఫీలు తీసుకొన్నారు.