కమలాపూర్, జూలై21: ప్రజాప్రతినిధులు, ప్రజల శ్రేయస్సు కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పోలీసులే టార్గెట్గా బీజేపీ నేత ఈటల రాజేందర్ మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రజాదీవెన పాదయాత్ర పేరుతో ఈ నెల 19న వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని బత్తినివానిపల్లిలో ప్రారంభమైన యాత్ర మూడు రోజులు కమలాపూర్ మండలంలో కొనసాగి ఇల్లంతకుంట మండలంలోకి ప్రవేశించింది. పాదయాత్రలో భాగంగా శనిగరం, నేరెళ్ల, గూడూరు తదితర గ్రామాల్లో జరిగిన సభల్లో ఈటల రాజేందర్ పోలీసులను చులకనగా చేస్తూ మాట్లాడారు. గులాబీ నేతలకు గులాం చేస్తున్నారంటూ, గులాబీ కండువా కప్పుకుని విధులు నిర్వహించుడ్రి అంటూ పోలీసులను అవమానించేలా వ్యాఖ్యానించారు. నేరెళ్లలో అడగడుగునా ఫొటోలు తీస్తున్నరు.. నక్సలైట్ అనుకుంటుడ్రా ఏమన్నా, తమాషా చేస్తున్నారా ఏమన్న, నౌకరీ చేయడం చేతకాకపోతే గులాబీ కండువా వేసుకుని రాండ్రి, నేను మా పోలీసు అధికారులకు చెప్పుతున్న ఇలాంటి వారిని గుర్తించండంటూ మాట్లాడాడు. పోలీసులు మఫ్టీలో ఉండి మా కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నరని ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
పాదయాత్రలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా సాగాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులపై ఈటల రాజేందర్ హెచ్చరిస్తూ మాట్లాడడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటల రాజేందర్కు ప్రత్యర్థులు టీఆర్ఎస్ పార్టీనా? పోలీసులా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అర్హతలేని బీజేపీ నాయకులు స్టేజీలపై అవహేళన చేసి మాట్లాడుతుండడంపై పోలీసులు అవమానంగా భావిస్తున్నారు. ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీసులను గౌరవించాల్సిన బీజేపీ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడడం బాధాకరం అంటూ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులను గుర్తించాల్సిన నాయకులు సభల్లో చులకనగా చేసి మాట్లాడితే గౌరవం ఏం ఉంటదని పలువురు పోలీసు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.