కలెక్టరేట్, జూలై 20: జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించాలని, పరిశ్రమల స్థాపన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టీఎస్ ఐ-పాస్ నిబంధనలకు లోబడి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత కలేక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు, తదితర అంశాలపై కమిటీ సభ్యులతో మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి 11.09 కోట్ల పెట్టుబడితో 54పరిశ్రమలను స్థాపించడానికి అనుమతులు మంజూరు చేశామని, తద్వారా 569మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పారిశ్రామిక రాయితీ పథకం ద్వారా 57మంది ఎస్సీ అభ్యర్థులకు 1.57కోట్లు, 34మంది ఎస్టీ అభ్యర్థులకు 93.22లక్షలు మంజూరు చేశామని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్రావు, లీడ్ బ్యాంక్ అధికారి రంగారెడ్డి, రాష్ట్ర ఆర్థిక సంస్థ అధికారి చంద్రవికాస్, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహణ సంచాలకుడు డా.వినోద్కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సార్, సెస్ డీఈఈ రఘుపతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి శైలజ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారి సుభాష్, దళిత పరిశ్రమల సమాఖ్య జిల్లా ప్రతినిధి మురళీమోహన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీడియాట్రిక్ సేవలు అందించాలి
వేములవాడ, జూలై 20: వేములవాడ ప్రభుత్వ ప్రాం తీయ దవాఖానలో 50పడకలతో చిన్నారుల కోసం పీడియాట్రిక్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ వైద్యులను ఆదేశించారు. మంగళవారం ఆయన వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానను క్షేత్రస్థాయిలో సందర్శించి, మాట్లాడారు. చిన్న పిల్లలకు వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 50పడకలు పీడియాట్రిక్ సేవలు అందించేందు కు కేటాయించాలని సూచించారు. అందులో 20పడకలు ఐసీయూ, మిగితా 30జనరల్కు కేటాయించాలని ఆదేశించారు. నిర్మాణ ప్రగతిలో ఉన్న ఆక్సిజన్ ట్యాంకు, ఆక్సిజన్ జనరేషన్ ట్యాంకు నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా వాటి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట సూపరింటెండెంట్ డాక్టర్ రేగులపాటి మహేశ్రావు, తదితరులు ఉన్నారు.