ముస్తాబాద్, ఫిబ్రవరి 13 : పేదలందరికీ పైసా ఖర్చులేకుండా గూడు కల్పించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం పథకానికి అంకురార్పణ చేసింది. దశలవారీగా సకల సౌకర్యాలతో కూడిన ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. ఇందులో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మొర్రాయిపల్లి ఇందిరమ్మకాలనీలో నిర్మించిన గృహసముదాయం ప్రారంభానికి సిద్ధమైంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు. అంతేకాకుండా దశలవారీగా అర్హులందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెబుతున్నారు.
నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం
మంత్రి కేటీఆర్ మూడేండ్ల కిందట ముస్తాబాద్కు 156 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. అధికారులు మండలకేంద్రం నుంచి మొర్రాయిపల్లెకు వెళ్లే దారిలో సర్వే నంబర్లు 998, 1001లో రెండెకరాల స్థలాన్ని గుర్తించారు. ప్రభుత్వం రూ.9.81 కోట్లు మంజూరు చేయగా, 2017 మార్చి 10న మంత్రి కేటీఆర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో పనులు కాస్త ఆలస్యమైనా ఇటీవలే పూర్తిచేశారు. పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ అనునిత్యం పర్యవేక్షించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇండ్లను నిర్మించారు. విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు, సీసీ రోడ్లు, తదితర సౌకర్యాలు కల్పించారు. అలాగే, గృహసముదాయం ఆవరణను తీరొక్క మొక్కలతో ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. వీటిని చూసి లబ్ధిదారులు ఆనందంలో మునిగిపోయారు.
పైసా ఖర్చుపెట్టకుండానే ఇల్లచ్చింది
మేం కడు పేదోళ్లం.. మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త మెడికల్ షాప్లో పనిచేస్తడు. వచ్చిన కొద్దిపాటి జీతం బతకడానికే సరిపోయేది. ఏండ్ల సంది కిరాయి ఇండ్లల్లో ఉంటూ బతుకులు ఎల్లదీసినం. ఇప్పుడు పైసా ఖర్చు పెట్టకుండనే సర్కారు ఇల్లు ఇచ్చింది. ఎంతో సంతోషంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– కడమంచి మంజుల
ఇల్లులేక గోసెల్లదీసినం
ఇల్లు కట్టుకుందామంటే గుంటెడు జాగలేకుండె. కొందామంటే చేతిలో చిల్లిగవ్వ మిగిలేది కాదు. సంపాదించిన పైసంతా బట్టపొట్టకే సరిపోయేది. ఇల్లులేక మస్తు గోస ఎల్లదీసినం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు మంచి ఇల్లు కట్టిచ్చింది. లోపలికి వెళ్లి చూసి సంబురపడ్డం. సర్కారు ఇల్లు గింత మంచిగుంటదని కలలో గూడ అనుకోలె.
– మద్దికుంట భాగ్యలక్ష్మి, శంకర్
సీఎం సారుకు రుణపడి ఉండాలి
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపి మండల కేంద్రంలో 156 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించారు. గృహసముదాయంలో అన్ని వసతులు కల్పించారు. విశాలమైన సీసీ రోడ్లు నిర్మించారు. పచ్చనిచెట్లతో ఆవరణను తీర్చిదిద్దారు. ఇండ్లలోపల తాగునీరు, మరుగుదొడ్లు, నల్లాలు ఇలా అన్ని రకాల వసతులు కల్పించారు. వీటిని చూస్తే విల్లాలు గుర్తుకు వస్తున్నాయి. లబ్ధిదారులు ముఖ్యమంత్రి సారుకు రుణపడి ఉండాలి.
-జనగామ శరత్రావు. ఎంపీపీ (ముస్తాబాద్)
మంత్రి కేటీఆర్ సహకారంతోనే..
ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడంతో ముస్తాబాద్కు కొత్త కల వచ్చింది. ఇండ్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ప్రజల పక్షాన కృతజ్ఞతలు. లబ్ధిదారులకు రూపాయి ఖర్చులేకుండా రెండు పడక గదుల ఇండ్లు లభించడం అదృష్టం. నిర్మాణానికి సహకరించిన మండల ప్రజాప్రతినిధులకు, నాణ్యతతో నిర్మించిన కాంట్రాక్టర్కు ధన్యవాదాలు.
– గాండ్ల సుమతి. సర్పంచ్ (ముస్తాబాద్)
నిరుపేదలకు అండగా ప్రభుత్వం..
రాష్ట్రంలో గూడు లేని పేదలకు కష్టం రావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇండ్లు నిర్మాణం చేపట్టడం హర్షణీయం. అపార్ట్మెంట్లను తలపించేలా ఇండ్లను నిర్మించారు. ఇందులో అన్ని వసతులు కల్పించారు. ఇండ్లు దక్కించుకున్న లబ్ధిదారులకు అభినందనలు.
– కల్వకుంట్ల గోపాల్రావు. ఆర్బీఎస్ మండల కన్వీనర్(మోహినికుంట)