చిగురుమామిడి, ఫిబ్రవరి 13 : సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన కొండాపూర్ స్వరాష్ట్రంలో కొత్తరూపును సంతరించుకున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమల్లో ముందువరుసలో నిలిచి జాతీయఖ్యాతి దక్కించుకున్నది. పల్లె ప్రగతి ఫలాలను అందిపుచ్చుకొని సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజనలో మెరుగైన స్థానాన్ని పొందింది. జాతీయస్థాయిలో 13, రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకులు సాధించి సత్తాచాటింది. మారుమూల గ్రామానికి అరుదైన గౌరవం దక్కడంతో పాలకవర్గం, పల్లె జనం హర్షం వ్యక్తం చేస్తున్నది.
మండలంలోని కొండాపూర్ జనాభా 2300. 672 గృహాలు, 1859 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రం సిద్ధించక ముందు ఈ పల్లె.. ప్రగతి జాడలేక చిన్నబోయింది. కంపుకొట్టే డ్రైనేజీలు, కంకరతేలిన మట్టిరోడ్లతో నానా కష్టాలు పడ్డది. పారిశుధ్యలేమితో పల్లెజనం రోగాలతో సతమతమైంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ ఊరు దశ తిరిగింది. అభివృద్ధి పనులకు విరివిగా నిధులు వెచ్చించింది. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లానీరు ఇచ్చింది. ఇంటింటికీ మరుగుదొడ్డి నిర్మించింది. ఇండ్ల ముంగిట్లో ఇంకుడు గుంతలు తవ్వించింది. హరితహారంలో విరివిగా మొక్కలు నాటించి హరితసొబగులు అద్దింది.
పల్లె ప్రగతితో మారిన పరిస్థితి..
ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో ప్రారంభించిన పల్లె ప్రగతితో కొండాపూర్ అభివృద్ధి బాట పట్టింది. మొదట పాలకవర్గ, వివిధ కమిటీల బాధ్యులు సమావేశమై సమస్యలను గుర్తించారు. తదనంతరం పరిష్కారానికి ఉపక్రమించారు. శిథిల భవనాలను కూల్చివేయించారు. చెత్తపొదలను తొలగింపజేశారు. పాడుబడ్డబావులను పూడ్చివేశారు. అలాగే రెండు, విడుతల్లో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఊరి శివారులో సెగ్రిగేషన్ షెడ్డు, డంప్యార్డులను నిర్మించారు. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతి వనాన్ని తీర్చిదిద్దారు. ఎవెన్యూ ప్లాంటేషన్తో గ్రామ రోడ్లకు హరితసొబగులు అద్దారు. మట్టిరోడ్ల స్థానంలో సీసీరోడ్లు, కంపుకొట్టే డ్రైనేజీల స్థానంలో పరిశుభ్రమైన మురుగుకాలువలను నిర్మించారు. సర్పంచ్ పెద్దపల్లి భవాని సొంత ఖర్చులతో బాలవికాస సంస్థ సౌకర్యంతో మంచినీటి సౌకర్యం కల్పించారు. అలాగే సంచారజీవనం గడిపే గంగిరెద్దుల కులస్తుల్లో చైతన్యాన్ని నింపారు. ఎంపీపీ కొత్త వినీతా శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో కాలనీలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అక్షరాస్యత ప్రాధాన్యతను వివరించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
గ్రామస్తుల సహకారంతోనే..
నేను బాధ్యతలు స్వీకరించి మూడేం డ్లు గడుస్తున్నది. ఈ కాలంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సహకరించారు. రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, మంత్రి తన్నీరు హరీశ్రావు, స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ నిధులు మంజూరు చేసి ప్రోత్సహించారు. గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు దక్కడం గర్వకారణంగా ఉన్నది.
– పెద్దపెల్లి భవాని, సర్పంచ్ కొండాపూర్
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు…
గ్రామ సర్పంచ్ అధికారుల సూచనల మేరకు అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాం. ముఖ్యంగా పల్లె ప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుంటున్నాం. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టినం. గ్రామానికి దేశస్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉన్నది. మున్ముందు మరింత ఉత్సాహంగా పనిచేస్తాం.
-రాంకీ, పంచాయతీ కార్యదర్శి కొండాపూర్