ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు అంటేనే నిత్యం పార్టీ, పాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉంటారు. ఏమాత్రం తీరికలేని సమయంలోనూ నిస్వార్థంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ప్రజల అభిమానాన్ని పొందేవారు అరుదుగా కనిపిస్తుంటారు. ఇదే కోవకు చెందుతారు తిమ్మాపూర్ మండలంలోని పలువురు నేతలు. ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా నిలుస్తూ.. కష్టాల్లో కూరుకుపోయిన పేదలకు చేయూతనిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.
-తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 20
ప్రజలకు అందుబాటులో..
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్రెడ్డి.. గ్రామాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తున్నారు. కేడీఆర్ యువసేన ఆధ్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల అభిమానాన్ని చూరగొంటున్నారు.
పార్టీలకు అతీతంగా సాయం
బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు.. నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలు, వారి కార్యకర్తల కుటుంబాల్లో ఆడబిడ్డల పెండ్లికి మంగళసూత్రం అందజేస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. అలాగే ఎవరు చనిపోయినా వారి కుటుంబానికి యాభై కిలోల బియ్యం అందజేస్తూ, అలాగే పార్టీలతో సంబంధం లేకుండా అవసరం ఉన్నవారికి తన స్థాయి మేరకు సహాయం చేస్తూ ఔదార్యాన్ని చాటుతున్నారు.
పేదలకు అండ.. ఆడబిడ్డలకు భరోసా
తిమ్మాపూర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, నుస్తులాపూర్ సర్పంచ్ రావుల రమేశ్.. మండలంలో ఏ గ్రామంలో పేదలు చనిపోయినా యాభై కిలోల బియ్యం అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. కార్యకర్తలు, నాయకుల ద్వారా ఆయన బియ్యం పంపిస్తూ బాధిత కుటుంబానికి ఓదార్పు నిస్తున్నారు. అలాగే గ్రామంలో ఆడపిల్లలకు రూ.ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నారు. ప్రజలకు సంబంధించి ఇతర సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.