వేములవాడ, డిసెంబర్ 6: రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా మంగళవారం రాజన్న ఆలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడమే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసేలా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగ పరంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలో గొప్పగా దళితబంధు, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ట్యాంక్ బండ్ సమీపంలో భారీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తూ మహనీయుడిని కొలుస్తున్నామని చెప్పారు. బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో నాయకులు జింక శ్రీధర్, సునీల్, శ్రీకాంత్, కుమ్మరి అనిల్ తదితరులు కూడా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సీఐ వెంకటేశ్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు మారం కుమార్, నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, సిరిగిరి రాంచందర్, నరాల శేఖర్, ఇప్పపూల అజయ్, యాచమనేని శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు బాబున్, డివిజన్ ఆటోయూనియన్ అధ్యక్షులు దేవరాజు, నాయకులు రామతీర్థపు రాజు, గడ్డం హన్మాండ్లు, కుమ్మరి శ్రీనివాస్, పెంట బాబు, నీరటి మల్లేశం, సలీం, పీర్ మహమ్మద్, రాజేశం, రాము తదితరులు ఉన్నారు.