కోల్సిటీ, నవంబర్ 29: నా అని అనుకునే వారికి ఏదైనా జరిగితే తల్లడిల్లిపోతాం. అలాంటిది మృతిచెందితే ఉద్వేగానికిలోనవుతాం. ఇంకా వారి అంతిమ సంస్కారం నిర్వహించే వైకుంఠధామం ఎక్కడో దూరాన ఉంటే తీసుకెళ్లేందుకు పడరానిపాట్లు పడుతుంటాం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దని, ఆఖరి మజిలీ చింతలేకుండా ఉండాలనే ఉద్దేశంతో రామగుండం బల్దియా వైకుంఠరథాలను ఏర్పాటు చేస్తున్నది. పేద కుటుంబాల్లోని వ్యక్తి తనువు చాలించినపుడు ఉచితంగా తరలించేందుకు రెండు వాహనాలు కొనుగోలు చేసి సేవలందిస్తున్నది. కొత్తగా నగరానికి మరో రెండు, పరిషత్ నిధులతో అంతర్గాం మండలానికి ఇంకో రథాన్ని తెప్పిస్తుండగా, త్వరలోనే ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధం చేసింది.
సమైక్య రాష్ట్రంలో శ్మశాన వాటికలను ఏనాడూ పట్టించుకోలేదు. గ్రామాల్లో, పట్టణాల్లో వైకుంఠధామాలు నిర్మించలేదు. ఉన్న చోట సౌకర్యాలు కల్పించలేదు. అంతిమ సంస్కారాల సమయంలో కుటుంబసభ్యులు ఇబ్బందు లు పడుతున్నా పరిష్కారం చూపలేదు. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లో ఆధునిక వైకుంఠధామాలను నిర్మించింది. కాగా, స్థానిక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మృతదేహాల తరింపునకూ వైకుంఠరథాలను ఏర్పాటు చేస్తూ, చివరి మజిలీకి చింత లేకుండా చేసింది.
చింతలేకుండా వైకుంఠ రథాలు..
ఎంతటి పేదరికం వారైనా.. సంపన్నులైనా చివరకు మృత్యువు ఒడికి చేరుకోవాల్సిందే. ఆ ఆఖరి మజిలీలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నే హితులు, సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు ఘ నంగా నిర్వహించాలని భావిస్తుంటారు. చనిపోయిన వ్యక్తిని ఎక్కడో ఉన్న వైకుంఠధామం దాకా తీసుకెళ్లాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు కొంచెం కష్టమే. సమయానికి ఎవరూ సాయంగా ఉండకపోవడంతో చనిపోయిన వ్యక్తి వద్ద రోదిస్తున్న ఆప్తులకు పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఆ ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దూరదృష్టితో ఆలోచించి రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో హిందువుల కోసం రెం డు వైకుంఠరథాలను అందుబాటులోకి తెచ్చారు. కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని, రామగుం డం, ఎన్టీపీసీ, యైటింక్లయిన్ కాలనీ పట్టణ ప్రజ లు వీటిని ఉచితంగా వాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ముస్లింలు, క్రైస్తవులకు కూడా వైకుంఠ రథాలను సమకూర్చాలని కొంతకాలంగా మైనార్టీ నాయకులు ఎమ్మెల్యే చందర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు స్పందించిన ఆయన కార్పొరేషన్లోని డీఎంఎఫ్టీ నిధుల నుంచి 30లక్షలు వెచ్చించి తాజాగా మరో రెండు వైకుంఠరథాలను కొనుగోలు చేయించారు. అందులో ఒకటి ముస్లింలకు అఖ్రి సఫర్, మరొకటి క్రైస్తవుల కోసం పరదేశి వాహనాలుగా నామకరణం చేశారు. కొత్తగా తీసుకవచ్చిన రెండు వైకుంఠ రథాలను వచ్చే నెల మొదటి వారంలో ఎమ్మెల్యే ప్రారంభించనున్నా రు. దీనితో రామగుండం కార్పొరేషన్లో మొత్తం నాలుగు వైకుంఠ రథాలు సేవలు అందించనున్నాయి. కాగా, నగరంలో వైకుంఠ రథం కావాల్సిన వారు 8099787878, 960366 6444 నంబర్లలో సంప్రదిస్తే వెంటనే ఆయా ప్రాంతాలకు వైకుంఠ రథాలను పంపిస్తున్నారు.
అంతర్గాం మండలానికి..
పక్కనే ఉన్న అంతర్గాం మండలంలోనూ త్వరలో వైకుంఠ రథం అందుబాటులోకి రానున్నది. రామగుండం కార్పొరేషన్లో నాలుగు వైకుంఠ రథం వాహనాలు అందుబాటులో ఉన్నా అక్కడి గ్రామాలకు పంపించడం వీలు కావడం లేదు. ఈ క్రమంలో వాహనం కావాలని ప్రజలు కొద్దిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే చందర్ అంతర్గాం మండలానికి మండ ల పరిషత్ నిధులు వెచ్చించి వైకుంఠ రథాన్ని ప్రత్యేకంగా తెప్పిస్తున్నారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు..
నగరంలోని నిరుపేద ముస్లింల సౌకర్యార్థం వైకుంఠ రథం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే చందర్కు విన్నవించగానే వెంటనే స్పందించారు. రెండు రథాలను తెప్పించారు. మృతదేహాల తరలింపునకు ఇక బాధలు ఉండవు. ముస్లింల తరపున ఎమ్మెల్యే చందర్, మేయర్ అనిల్కుమార్కు కృతజ్ఞతలు చెబుతున్నా.
– తస్నీం భాను, కో-ఆప్షన్ మెంబర్ (రామగుండం)
అవస్థలు పడవద్దనే..
నా అనుకునే వారు చనిపోతే వారిని వైకుంఠధా మం దాకా తీసుకెళ్లేందుకు నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. స్థోమత గలవాళ్లు మాత్రమే వైకుంఠ రథాల్లో తీసుకెళ్తారు. పేదలకు ఈ సౌకర్యాన్ని కల్పించాలనే 4 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. అంతర్గాం మండలానికి మంజూరు చేశాం.
– కోరుకంటి చందర్, ఎమ్మెల్యే (రామగుండం)