కార్పొరేషన్/కలెక్టరేట్, నవంబర్ 29: ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మాణ పనుల్లో వేగం పెంచి, జనవరిలోగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. భవన నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రూ.12 కోట్లతో అత్యాధునిక సదుపాయాలతో భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్రావు, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్ అండ్ బీ ఈఈ సాంబశివరావు, ఏఈ రాజశేఖర్, నాయకుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.
దళితులకు, ప్రభుత్వానికి వారధిలా పని చేయాలి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు దళితులకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నాయకులు వచ్చిన పదవులకు న్యాయం చేయాలని, కమిటీ సభ్యులకు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దళితబంధు యూనిట్లను విక్రయించడం కాని, లీజుకు ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళితబంధు యూనిట్ల కోసం లబ్ధిదారులు దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లించినట్లు తెలిస్తే రిజక్ట్ చేస్తామన్నారు.
నూతన కమిటీ సభ్యులు రాజ్యాంగబద్ధంగా పని చేయాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఏ రోజు కూడా దళితుల జీవితాల్లో వెలుగులు నింపే పథకాలను తీసుకురాలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ దళితులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే దళితబంధు తీసుకువచ్చారన్నారు. దళితబంధు యూనిట్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ ఏడాది అట్రాసిటీ బాధితులకు ఇప్పటి వరకు రూ.50.25 లక్షల పరిహారం అందించామన్నారు. ఈ సంవత్సరంలో నమోదైన అట్రాసిటీ కేసులు 95 కాగా, వీటిలో 21 తప్పుడు కేసులు, 33 చార్జీషీట్లు, 41 ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పవన్కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నతానియేల్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నాగార్జున, ఎస్టీ అభివృద్ధి అధికారి గంగారం, కమిటీ సభ్యులు మేడి మహేశ్, ఎలుక ఆంజనేయులు, కులదీప్వర్మ, నర్సింహాబాబు, రవి పాల్గొన్నారు.