కమాన్చౌరస్తా, నవంబర్ 28:అయ్యప్పస్వామి దీక్ష అందరికీ మోక్షదాయకం.. స్వామియే శరణమయ్యప్ప.. స్మరణ శుభదాయకం. మనసారా అయ్యప్పస్వామిని కొలవడమే దీక్ష పరమార్థం. మండలకాలం దీక్ష పూర్తి చేసిన స్వాములు టెంకాయ అనే దేహంలో ఆత్మ అనే నెయ్యి పోసి శబరిమలకు మోసుకెళ్లి అయ్యప్పకు సమర్పించడం దీక్ష ప్రత్యేకత..
కుల మతాలకతీతంగా అందరూ ఒక్కటేననీ.. ప్రతి దీక్షాపరునిలో అయ్యప్పస్వామి కొలువై ఉన్నాడనీ.. దీక్షాకాలంలోనే కాకుండా ఆ సుగుణాలను జీవితాంతం పాటించాలనీ మండల దీక్ష చెబుతోంది.. రోజులో ఒకసారి భోజనం (భిక్ష).. మరోసారి అల్పాహారం.. రెండుసార్లు చన్నీటి స్నానం..నేలపై శయనం.. వంటి కఠిన నియమాలు పాటిస్తూ స్వామివారి భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్న దీక్షాపరుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. కార్తీకమాసం ఆరంభానికి ముందే దీక్షాపరుల సందడి కనిపిస్తోంది.
శబరిమల యాత్ర
గతంలో మాదిరిగా కాకుండా అయ్యప్ప స్వామి దర్శనానికి ట్రావెన్కోర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఇందులో భాగంగా ముందు వర్చువల్ క్యూ బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయానికి అనుమతి ఉంటుంది. ఇంతకు ముందులాగా ఆలయానికి వెళ్లే వివిధ మార్గాల ద్వారా కేరళ చేరుకుని, ఎరిమెలిలో వావరు స్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి పెద్దపాదం ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్లవచ్చు. అలా కాకుండా నేరుగా పంబకు చేరుకుని పంబానదిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి చిన్నపాదం ద్వారా వెళ్లవచ్చు. వర్చువల్ క్యూ బుక్ చేయించుకున్న వారిని రోజుకు లక్ష మందిని అనుమతిస్తుండగా, శని, ఆదివారాల్లో ఆ సంఖ్యను పెంచుతున్నారు.
ఆరోగ్యానికి ఏంతో మేలు..
అయ్యప్పదీక్ష ఆధ్యాత్మిక భావాలు పెంపొందించడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. చన్నీటి స్నానంతో రోగాలు దూరమవుతాయని, చెప్పులు లేకుండా నడవడంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఏకభుక్తంతో శరీరాకృతిమారుతుంది. పూజల్లో మామిడితోరణాలు, పసుపు, అరటికొమ్మలతో పందిళ్లు వేయడం ద్వారా మంచిగాలిని పీల్చుకునే అవకాశం ఉంటుంది. నేలపై నిద్రించడంతో వెన్ను నొప్పి దూరమవుతుంది. నదీస్నానంతో ఆయుష్షు పెరుగుతుంది. పంబానదిలో ఎన్నో వనమూలికలతో కూడిన ప్రవాహంలో స్నానం చేయడం ద్వారా రుగ్మతలు తగ్గుతాయి. నుదుటిపై విభూది నుదిటి మధ్యభాగంలో నరాలకు చల్లదనాన్ని ఇస్తుంది. యాంటీబ్యాక్టీరియాగా పనిచేసి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. గంధం వాసనతో ప్రశాంతత లభిస్తుంది.
ఇరుముడి
దీక్షా కాలం ముగిసిన వారు ఆరు పర్యాయాలు శబరియాత్రకు వెళ్లివచ్చిన గురుస్వాములతో ఇరుముడి కట్టించుకోవాలి. నల్లని సంచితో ఇరుముడి ఏర్పాటు చేస్తారు. మొదటి ముడిని ‘ఇరుముడి’ అంటారు. ఈ సంచిలో పూజాద్రవ్యాలు ఉం చుతారు. ఇదే ఇరుముడిలో దేహంగా భావించే ‘టెంకాయ’ను శుభ్రం చేసి ఆత్మగా భావించే ‘ఆవునెయ్యి’ని పోస్తారు. నెయ్యితో నిండిన ఆత్మను ఇరుముడిలో కట్టుకుంటారు. ఇంకోపక్క ఉన్న ఇరుముడిలో అవసరమైన పదార్థాలు పెట్టుకున్నారు. శబరిమల యాత్రకు వెళ్లే స్వాములు యాత్ర వివరాలు పూర్తిగా తెలిసిన గురుస్వాముల వెంట వెళ్లాలి. దీక్షాపరులు తమవెంట ఇరుముడితో పాటు ఒక జత దుస్తులు మాత్రమే తీసుకువెళ్లాలి.
సంకల్పంతో కూడుకున్నది దీక్ష
అయ్యప్ప స్వామి మండల దీక్ష చేయాలనుకోవడం గొప్ప సంకల్పంతో కూడుకున్నది. దీక్ష స్వీకరించిన ప్రతి ఒక్కరూ 41 రోజులు నియమాలు పాటిస్తూ, ఏ రూపం కనిపించినా స్వామి రూపంలా భావించాలి. ప్రతి ఒక్కరినీ స్వామి అని పిలవాలి. ఈ దీక్ష వల్ల ఏకాగ్రత, క్రమశిక్షణ, ప్రశాంతత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. దీక్షపవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అయ్యప్పదీక్షాపరులపైనే ఉంది.
– మంగళంపల్లి రాజేశ్వర శర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు
స్వాముల సంఖ్య పెరుగుతున్నది
ఏదైనా పనిని నిత్యజీవితంలో మండల కాలం పాటు చేస్తే మార్పు వస్తుంది. ఇందులో నుంచి అయ్యప్ప దీక్ష వచ్చింది. ఈ క్రమంలోనే అయ్యప్ప స్వామి మండల దీక్ష స్వీకరించిన వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. ఇది శుభ పరిణామం. దీక్షా సమయంలో పాటించే నియమాలతో ఆరోగ్యంతో పాటు ప్రశాంతత లభిస్తుంది. నియమ, నిబంధనలతో దీక్ష ఆచరిస్తే జీవితంలో ఎంతటి అడ్డంకులైనా ఎదిరించవచ్చు. తేనీరు, అన్నదానం, అల్పాహారం అందిస్తున్నాం.
– డింగరి చాణక్య, ఆలయ అర్చకుడు
మాలధారులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఇప్పటి వరకు హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయంలో దాదాపు 1500 మంది వరకు అయ్యప్ప మాల ధరించారు. వారందరికీ కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆలయంలో భక్తుల కోసం ఉదయం తేనీరు, బాదం పాలు, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్ర అల్పాహారం మంత్రి గంగుల కమలాకర్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, దాతల సహకారంతో ఉచితంగా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములై విజయవంతం చేయాలి.
– కే కాంతారెడ్డి, అయ్యప్ప ఆలయ ఈవో
దీక్షకు మూడు రోజుల ముందే..
అయ్యప్పస్వామి మాల ధరించాలనుకునే వారు మూ డు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. దురలవాట్లకు స్వస్తి పలకాలి. మద్యం, మాంసాహారాలు స్వీకరించరాదు. గోళ్లు, తలవెంట్రుకలు ముందే కత్తిరించుకోవాలి. దీక్ష స్వీకరణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి తప్పక తీసుకోవాలి.
దీక్ష స్వీకరించే రోజు..
మాలధరించే రోజు భక్తులు పాదరక్షలు లేకుండా ఉతికిన బట్టలు ధరించి సమీపంలోని అయ్యప్పగుడికి వెళ్లాలి. నల్ల లుంగీ, నల్లని కండువా, చొక్కా, తులసిమాలలను వెంట తీసుకెళ్లాలి. గురుస్వామితో మాలధరించే ముందుగానే నుదుటిపై అలంకరణ చేసుకోవాలి. బ్రహ్మదేవుడిని చందనంగా.. శివుడిని విభూది రూపంలో.. విష్ణుమూర్తిని కుంకుమరూపంలో దిద్దుకోవాలి. ఆరుపర్యాయాలు శబరియాత్రకు వెళ్లి మకరజ్యోతిని దర్శించుకున్న గురువుతో మాలస్వీకరించాలి. మాల మెడలో వేసేటప్పుడు స్వామియే శరణమయ్యప్ప అంటూ స్మరించాలి. మాల ధరించాక మొదటిసారి గురుస్వామికి పాదపూజ చేసుకోవాలి. సమీపంలోని గణపతి, సుబ్రమణ్యస్వామి, అమ్మవారి ఆలయాలను దర్శించుకోవాలి.
దీక్ష స్వీకరించాక..
మాల ధరించిన స్వాములు మండల దీక్ష పూర్తి చేసుకునేందుకు విడిది సమకూర్చుకోవాలి. ఇంట్లో స్థలం ఉంటే అక్కడే పీఠం పెట్టుకోవచ్చు. లేదంటే స్వాములంతా సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు. సన్నిధానంలో ప్రత్యేక పీఠం ఏర్పాటు చేసి దానిపై నూతన వస్త్రం వేసి బియ్యం పోసి గణపతి, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వాముల చిత్రపటాలు ప్రతిష్ఠించాలి. మండల దీక్ష కోసం సంకల్పం తీసుకుని కలశస్థాపన చేయాలి. ఒకసారి కలశస్థాపన జరిగిన తర్వాత దీక్ష ముగిసేంతవరకు కదిలించే వీలుండదు. పీఠంపై దేవతామూర్తుల చిత్రపటాలు ప్రతిష్ఠించాక అటూ ఇటూ కదపరాదు. దేవతామూర్తుల చిత్రపటాలకు శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి. దీపారాధన చేసి స్వామివారికి పూజ ప్రారంభించాలి. ముందుగా గణపతిపూజ, సుబ్రహ్మణ్యస్వామిని కొలిచి అయ్యప్ప పూజను కొనసాగించాలి. పూజముగిశాక హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు కొనసాగించాలి. అనంతరం మాల ధరించిన స్వాములు సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి.
చన్నీటి స్నానం
మాల ధరించిన స్వాములంతా చన్నీటి స్నానం ఆచరించాలి. వేకువజామున బ్రహ్మ మూహుర్తంలో స్నానం చేసి సూర్యోదయం లోపే పూజ ముగించాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మళ్లీ చన్నీటి స్నానం సంధ్యా పూజకు కూర్చోవాలి.
క్రమశిక్షణ
దీక్షాకాలంలో అయ్యప్పస్వాములు క్రమశిక్షణతో మెలగాలి. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడాలి. తోటి స్వాములతో సఖ్యతగా ఉంటూ గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. పాదపూజలు చేసుకోవాలి. ఇలాంటి నియమాలతో మనిషిలో క్రమశిక్షణ పెరుగుతుంది. అహంకారం నశిస్తుంది. కోటీశ్వరుడైనా సరే అయ్యప్పదీక్షలో నేలపై కూర్చుని తోటిస్వాములతో కలిసి భోజనం చేసి అందరితో కలిసి పూజ చేయాలి. పాదయాత్రగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలి.
అన్నదానం.. అల్పాహార దానం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్నగర్ హరిహరక్షేత్రం లో అయ్యప్పస్వాముల కోసం దాతల సహకారంతో దేవా దాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అన్నదానం, అల్పాహార దానం ఏర్పాటు చేశారు. వీటితోపాటు ఉదయం ఉచితంగా తేనీరు, బాదం పాలు అందజేస్తున్నారు. అలాగే, నగరంలోని పాత బజార్ శివాలయంలో, కృష్ణానగర్ అయ్యప్ప ఆలయంలో అయ్యప్పసాములకు దాతల సమకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.