తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 22: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంతో వడ్లు పుట్లుగా పండాయి. మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరినాట్లు వేయగా.. అదేస్థాయిలో వడ్లు కూడా కొనుగోలు కేంద్రాలకు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు మండలంలో జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం కోతలు పూర్తి కాగా, రైతులు ధాన్యం ఆరబోత, తాలు పట్టడంలో బిజీ అయ్యారు. ఇప్పటికే తూకం పూర్తయిన వారికి వెంట వెంటనే నగదు జమవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికో కేంద్రం..
గతంలో రెండు మూడు గ్రామాలకు కలిపి కొనుగోలు కేంద్రాలను నిర్వహించే సొసైటీలు.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేస్తున్నారు. మండలంలో పోరండ్ల, నుస్తులాపూర్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలతో పాటు ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పోరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో పోరండ్ల, మన్నెంపల్లి, తిమ్మాపూర్, మహాత్మానగర్, అల్గునూర్లో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. నుస్తులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణకాలనీ, పర్లపల్లి, మొగిలిపాలెం, నల్లగొండ, మక్తపల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి, గొల్లపల్లి, నేదునూర్, లక్ష్మీదేవిపల్లి, వచ్చునూర్, రామహనుమాన్నగర్, జూగుండ్లలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో నుస్తులాపూర్, రేణికుంట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్ ద్వారా ఇందిరానగర్లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
మద్దతు ధర..
రైతులు కొనుగొలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందుతున్నారు. ఏ గ్రేడ్ రకానికి రూ.2060, బీ గ్రేడ్ రకానికి రూ.2040 క్వింటాలుకు అందిస్తున్నారు. ఇప్పటి వరకు మండలంలో సుమారు 70 వేల క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేశారు. నుస్తులాపూర్ సొసైటీ ఆధ్వర్యంలో 44,500 క్వింటాళ్లు, ఐకేపీ ఆధ్వర్యంలో 11,500, పోరండ్ల సొసైటీ 17వేల క్వింటాళ్లు, డీసీఎంఎస్ 3 వేల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేసింది.
కొనుగోలు కేంద్రాల్లో ఒక బస్తాకు 41 కిలోలు, కొన్ని కేంద్రాల్లో బస్తాకు 42 కిలోలు తూకం వేస్తున్నారు. ఆరబెట్టి, తాలుపట్టి, తేమ శాతం వస్తేనే నిర్వహకులు తూకం వేసి రైస్మిల్లులకు పంపిస్తున్నారు. ఎక్కడైనా రైస్మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే నేరుగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగుతున్నారు.
ఆనందంలో రైతులు..
ఈసారి పంట దిగుబడి తక్కువ వచ్చినప్పటికీ.. ఎక్కువ విస్తీర్ణంలో పంట పండడంతో సంతోషంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరబెట్టి, తాలు పట్టగానే తూకం వేస్తున్నారు. అనంతరం ఆన్లైన్లో నమోదు చేసిన వారంలోపే నగదు నేరుగా రైతు ఖాతాలో పడుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి నారుమడులు దున్నుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
కేంద్రాల్లోనే అమ్మండి
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నం. రైతులు కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని బయట ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతున్నట్టు సమాచారం వచ్చింది. బయట వ్యక్తులకు అమ్ముకోవడంతో వారు పేమెంట్ ఇవ్వకుండా తిప్పుకుని మోసం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. బయట అమ్ముకుని ఆగం కావద్దు. ఆలస్యమైనా మంచిదే.. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలి. ఎక్కడైనా రైతులకు సమస్యలుంటే అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలి.
–డాక్టర్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్