హుజూరాబాద్, జూలై 10: బీజేపీ నేత ఈటల నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని, ఆయన వ్యవహారం చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు ఎద్దేవా చేశారు. శనివారం హుజూరాబాద్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కుల సంఘాల నాయకులకు టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో ఎర వేస్తున్నదని ఈటల మాట్లాడడం జుగుప్సాకరంగా ఉందని, అతను అలా మాట్లాడడం పేదల ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లేనని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను టీఆర్ఎస్ కొంటున్నదని అనడం విడ్డూరంగా ఉందని.. మరి రెండ్రోజుల క్రితం ఓ సర్పంచ్ని పార్టీలో చేర్చుకోవడాన్ని ఏమనాలో ఈటలే చెప్పాలని ప్రశ్నించారు.
రాజేందర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదనేది వాస్తవమని, ఏ ఒక్క నాడూ అభివృద్ధి పనులకు నిధుల కోసం సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లలేదని మండిపడ్డారు. ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల మంత్రులు ముందుకు వస్తుంటే వారిపై బురద జల్లడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. డబ్బులతో ఎర వేస్తున్నారని మాట్లాడుతున్న ఈటల.. గడియారాలు, కుట్టుమిషన్లు ఎందుకు పంచుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు డబ్బులు ఇస్తూ, మద్యం తాగిస్తూ తన వెంట తిప్పుకొంటూ రాజేందర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పదవిలో ఉండి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వలేదని, ఇప్పుడు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తే ఈటల కండ్లు మండుతున్నాయని ధ్వజమెత్తారు.
కల్లబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్మరని, ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారనే విషయాన్ని రాజేందర్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఇతర నియోజకవర్గాలు అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడ ఎందుకు పనులు కాలేదో జవాబు చెప్పాలని ప్రశ్నించారు. కుల సంఘాలకు ఎర వేస్తున్నారని ఈటల వ్యాఖ్యానించడం వారిని అవమానపరిచినట్లేనని దుయ్యబట్టారు. ఓట్లు, నోట్ల రాజకీయం చేసేది ఈటలనేనని, ఈ మాట ఎక్కడ ఆయన్ను అంటారోనని టీఆర్ఎస్ను విమర్శించడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు.