దళితబంధు అమలుకు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడే మరో ప్రయోగాన్ని చేస్తున్నది. పథకం అమలులో మరింత పారదర్శకత కోసం టీఎస్ ఆన్లైన్లో దళితబంధు యాప్ను డెవలప్ చేసి, అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే పూర్తి స్థాయిలో లబ్ధిపొందిన వారితోపాటు 50 శాతం ఆర్థిక సాయం అందిన వారి వివరాలను అప్లోడ్ చేసింది. అంతే కాకుండా గ్రౌండింగ్ అయిన యూనిట్లను లబ్ధిదారులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారనే అంశాలను కూడా పరిశీలించి నమోదు చేయిస్తున్నది. మొదటి విడుతలో 50 శాతం మాత్రమే ఈ సాయం అందిన లబ్ధిదారులు ఇకపై రెండో విడుత కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ఎంపీడీవోలకు వివరాలు అందిస్తే ఈ యాప్ ద్వారా మిగతా మొత్తాన్ని సులువుగా విడుదల చేయవచ్చని, అలాగే ఇప్పటికే ఉన్న యూనిట్ను కాకుండా కొత్త యూనిట్ను ఎంచుకొనే అవకాశముందని చెబుతున్నారు. మున్ముందు యాప్ ద్వారానే ఎంపిక, గ్రౌడింగ్ జరుగుతుందని వివరిస్తున్నారు.
కరీంనగర్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం కోసం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్గా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గానికి వంద యూనిట్లను ఇచ్చింది. హుజూరాబాద్లో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు అందించారు. అయితే ఈ పథకంలో పూర్తి పారదర్శకత పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఆన్లైన్లో ప్రత్యేక యాప్ను డెవలప్ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ యాప్ను క్లస్టర్ అధికారులు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ఇప్పటికే వినియోగిస్తున్నారు. క్లస్టర్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇప్పటివరకు గ్రౌండింగ్ చేసిన యూనిట్లను యథాస్థితిని పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం అందిందా..? 50 శాతమే అందిందా..? అందిన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. పథకం అమలైన తర్వాత వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పులు, యూనిట్ను సద్వినియోగం చేసుకోనట్లయితే యథాస్థితిని ఫొటోలతో సహా దళితబంధు యాప్లో అప్లోడ్ చేస్తున్నారు.
పారదర్శకత పాటించే విధంగా..
హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన దళితబంధు యాప్ ద్వారా పూర్తి పారదర్శకత పాటించినట్లవుతుందని ప్ర భుత్వం భావిస్తున్నది. పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఈయాప్ ద్వారా ఎంపిక, గ్రౌండింగ్ ఉండబోతున్నదని తెలుస్తున్నది. దళితబంధు యూనిట్లు ఇప్పిస్తామని కొందరు దళారులు అమాయకులైన దళితులను మోసగిస్తున్నారనే విషయం కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 50 శాతం ఆర్థిక సాయం మాత్రమే అందిన లబ్ధిదారులు మిగతా మొత్తం కోసం చాలాచోట్ల కొందరు ప్రజాప్రతినిధులు, దళారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. కొందరు దళారులైతే మిగతా మొత్తాన్ని తామే ఇప్పిస్తామని దళితుల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దళిత బంధు యాప్ సాయంతో ఇలాంటి చర్యలను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
మీకు రెండో విడత రావాల్సి ఉందా..?
దళితబంధు పథకంలో యూనిట్ల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సెక్టార్లను ఎంపిక చేసింది. ఇందులో అగ్రికల్చర్ అసైన్డ్, మ్యానిఫ్యాక్చర్ అండ్ ఇండస్ట్రీ, రిటైల్ అండ్ షాప్స్, ట్రాన్స్ఫోర్ట్, సర్వీస్ అండ్ సప్లయ్స్, ఎనిమల్ హస్బెండరీ సెక్టార్లుగా విభజించి యూనిట్లను గ్రౌండింగ్ చేసింది. అయితే ఇందులో రిటైల్ అండ్ షాప్స్, ఎనిమల్ హస్బెండరీ సెక్టార్లలో యూనిట్లు ఆశించిన వారిలో కొందరికి 50 శాతం మాత్రమే ఆర్థిక సాయం చేశారు. ఈ యూనిట్లను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో పరిశీలించి మిగతా మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 13,944 యూనిట్లు గ్రౌండింగ్ చేసిన అధికారులు సుమారు 4 వేల యూనిట్లకు 50 శాతం మాత్రమే ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. ఇపుడు వీరికి పూర్తిస్థాయిలో ఇచ్చేందుకు క్లస్టర్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ లబ్ధిదారులకు మరో మంచి అవకాశాన్ని కూడా అధికారులు ఇస్తున్నారు.
ఇది వరకు ఉన్న యూనిట్లనే కాకుండా రెండో యూనిట్గా కొత్త దానిని కూడా ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. అదెలాగంటే ఇప్పటివరకు డెయిరీ యూనిట్ ఎంచుకున్న లబ్ధిదారులకు మొదటి విడుతగా రూ.5లక్షలు ఇచ్చారు. మిగిలిన రూ.4. 90 లక్షలు ఇవ్వాల్సి ఉంది. లబ్ధిదారులు పాత యూనిట్నే డెవలప్ చేసుకుంటారా..? దానికి అనుబంధంగా కొత్త యూనిట్ను ఏర్పాటు చేసుకుంటారా..? అనేది లబ్ధిదారుల ఇష్టానికి వదిలేస్తున్నారు. లబ్ధిదారులు ఉన్న యూనిట్నే కొనసాగించాలనుకున్నా, కొత్త యూనిట్ను ఏర్పాటు చేసుకోవాలన్నా సంబంధిత కొటేషన్, చెక్మెమోను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. దానిని పరిశీలించిన తర్వాత ఎంపీడీవోలు దళిత బంధు యూనిట్లో బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా అప్లోడ్ చేస్తారు. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు సిఫారసు మేరకు కలెక్టర్ ఆయా బ్యాంకులకు ప్రొసీడింగ్స్ పంపిస్తారు. లబ్ధిదారులు ఆయా బ్యాంకులకు వెళ్లి పూర్తిస్థాయిలో ఆర్థిక సాయాన్ని ఈ విధంగా పొందవచ్చు.
రెండో యూనిట్కు అవకాశం ఉంది..
దళిత బంధులో 50 శాతం ఆర్థిక సహాయాన్ని మాత్రమే పొంది ఇప్పటికే ఒక యూనిట్ను కొనసాగిస్తున్న లబ్ధిదారులు రెండో విడుత సాయం కోసం సంబంధిత కొటేషన్, చెక్మెమోను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందించాలి. వారు దళితబంధు యాప్లో అప్లోడ్ చేస్తారు. వాటిని మేం పరిశీలించి ప్రొసీడింగ్ కోసం కలెక్టర్కు పంపిస్తాం. కలెక్టర్ ఆమోదం తర్వాత ప్రొసీడింగ్లు సంబంధిత బ్యాంకులకు, అక్కడి నుంచి లబ్ధిదారులు ఇచ్చిన కొటేషన్ ఏజెన్సీకి డబ్బులు వెళ్తాయి. అపుడు లబ్ధిదారులు యూనిట్ను గ్రౌండింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి వారు ఇప్పటికే ఉన్న యూనిట్ కాకుండా కొత్త యూనిట్ కూడా ఎంచుకునే వీలుంది. ఉదాహరణకు రూ.5 లక్షలతో పాడి యూనిట్ పెట్టుకున్న లబ్ధిదారుడు రెండో విడుతలో వచ్చే రూ.4.90 లక్షలతో ఇదే యూనిట్ను పెట్టుకోవచ్చు. లేదంటే మరో యూనిట్నూ ఎంచుకోచ్చు. తాము ఎంచుకున్న యూనిట్కు సంబంధించిన కొటేషన్ ఎంపీడీవోలకు ఇస్తే సరిపోతుంది. రెండో విడుత విడుదల కోసం ఎవరి వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.
– డీ సురేశ్, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి