కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు వచ్చే రైతులు ఆకలితో ఇబ్బందులు పడవద్దని ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చేతులమీదుగా ప్రారంభించి, ప్రస్తుతం రోజూ వంద మందికి కడుపునిండా మీల్స్ పెడుతున్నది. ప్రత్యేక మెనూ ప్రకారం రెండు, మూడు రకాల కూరలు, పెరుగుతో రుచి, శుచిగా వడ్డిస్తుండడంతో కర్షకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ముకరంపుర, నవంబర్ 14: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కొత్తపల్లి, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్ మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. ప్రధాన ఆహార పంటగా వరి, మక్క, వాణిజ్య పంటగా పత్తి, అపరాలు, పప్పుదినుసులు సాగు చేస్తుంటారు. రోజుకు దాదాపు 100 మంది తమ పంట ఉత్పత్తులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు వస్తుంటారు. తెచ్చిన పంట వెంటనే అమ్ముడుపోతే ఇబ్బందిలేదు కానీ లేదంటే రైతన్న కడుపు కాలుడే. ఉదయం నుంచి రాత్రి దాకా మార్కెట్లోనే వేచి చూడాల్సిన పరిస్థితి. మార్కెట్కు వచ్చే వారిలో చేతిలో చిల్లిగవ్వలేనివారే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. బయటికి వెళ్లి హోటల్లో తినలేని పరిస్థితి. ఆకలి బాధను దిగమింగుకుని యార్డులోనే నిరీక్షిస్తుంటారు. రైతుల ఇబ్బందులను గుర్తించిన మార్కెట్ కమిటీ ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11వ తేదీనే మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించి, రైతులకు కమ్మని రుచికరమైన భోజనం పెడుతున్నది.
సీజన్లో ప్రతి రోజూ భోజనం
ప్రస్తుతం మార్కెట్లో వానకాలం సీజన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రైతులు పల్లెల నుంచి పత్తి, వరి ధాన్యం తీసుకువస్తున్నారు. అయితే, పంట ఉత్పత్తులతో మార్కెట్కు వచ్చే రైతుల వివరాలను మార్కెట్ సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటారు. ఈ మేరకు వారికి మధ్యాహ్నం భోజనం వండి వడ్డించేలా మెనూ రూపొందించారు. మార్కెట్ సెలవులు మినహా మిగిలిన రోజుల్లో రైతులకు భోజనం అందించేలా పూర్తి స్థాయి ప్రణాళిక రూపొందించి, ఏలోటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
రుచి.. శుచి.. శుభ్రత
భోజనం అంటే ఏదో అన్నం, పప్పు కాదు తీరొక్క రకం కూరలతో పెట్టేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మెనూ రూపొందించారు. అన్నంతో పాటు పప్పు, సాంబారు, పెరుగు, సీజన్లో లభించే కూరగాయలతో తయారు చేసిన ఓ కూరతో భోజనాన్ని వడ్డించనున్నారు. తాగునీటి విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్కెట్లోని ఆర్వో ప్లాంటు ద్వారా ప్రతి రైతుకు శుద్ధజలాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు.
అందరికీ అన్నం పెట్టే రైతు ఆకలితో ఉండొద్దని..
దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆకలితో ఉండవద్దనే ఆలోచనతో మార్కెట్ కమిటీలో ఉచిత ‘మధ్యాహ్న భోజనం’ అమలు చేస్తున్నాం. మా ఆలోచనను మంత్రి గంగుల కమలాకర్కు చెప్పగానే ప్రోత్సహించారు. పంట అమ్మేందుకు మార్కెట్కు వచ్చే వారిలో ఎక్కువ మంది చేతిలో డబ్బుల్లేక కాలే కడుపుతో ఇబ్బంది పడే పరిస్థితి చూసి చలించిపోయాం. రైతన్న ఆకలితో అలమటించవద్దనే ఆలోచనతో మార్కెట్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. తీరొక్క రకం కూరలతో భోజనం పెడుతున్నాం.
– రెడ్డవేని మధు, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్
మంచి ఆలోచన చేసిండ్రు..
ఎనకటి నుంచి మేం కరీంనగర్ మార్కెట్లనే పత్తి, మక్కలు, వడ్లు అమ్ముతున్నం. ఇప్పుడు అర ఎకరంల వేసిన పత్తిని అమ్మకానికి తెచ్చిన. రైతుల కోసం పగటి పూట కడుపునిండా అన్నం పెడుతున్నరని తెలిసి చాలా సంతోషించా. ఇంతకు ముందు హోటళ్లకు పోయెటోళ్లం. రైతుల కోసం మంచి ఆలోచన చేసిండ్రు.
– చీకటి రాములు, జగ్గయ్యపల్లె
తిండి బాధలేదు
మార్కెట్లకు వడ్లు అమ్మడానికి వస్తే తిండికి ఇబ్బంది పడేటోళ్లం. సద్ది తెచ్చుకోకుంటే ఇంటికి పోయే దాకా ఉపాసం ఉండెటోళ్లం. ఇప్పుడు మార్కెట్ల మధ్యాహ్నం అన్నం పెడుతున్నరు. ఇప్పటి నుంచి తిండికి ఏం బాధలేదు. ఇబ్బందులు తప్పినయి. – బాగోతం సుగుణ, బొమ్మకల్
రైతులకు అన్ని సౌకర్యాలున్నయి..
మాది బొమ్మకల్. రెండెకరాల్లో వరి వేసినం. రెండు ట్రాకర్ల వడ్లను అమ్ముదామని మార్కెట్కు తెచ్చినం. మునుపటి కంటే మార్కెట్ల అన్ని సౌకర్యాలు మంచిగున్నయి. ఇప్పుడు మా రైతులు ఆకలితో ఇబ్బందులు పడవద్దని కడుపునిండా అన్నం పెడుతున్నరు. ఇంతకంటే మాకు ఇంకేం గావాలి. మార్కెట్ కమిటీకి ధన్యవాదాలు.
– బాగోతం లక్ష్మి, బొమ్మకల్
భోజనం బాగున్నది..
మాది బొమ్మకల్. కౌలుకు తీసుకుని మూడు ఎకరాల్లో వరి వేసిన. మూడు ట్రాక్టర్ల వడ్లను మార్కెట్కు తెచ్చిన. ఇంటి దగ్గరి నుంచి తినడానికి ఏమి తెచ్చుకోలే. ఈ సీజన్ నుంచి మార్కెట్లనే రైతులకు భోజనం పెడుతున్నరని చెబితే సంతోష పడ్డం. అన్నం తిన్నం. చాలా రుచిగా బాగున్నది. ఎప్పుడు ఇట్లనే ఉండాలే.
– అప్పాల లక్ష్మి, బొమ్మకల్
తిండికి గోసపడేటోళ్లం.
నాకు కరీంనగర్ శివారులో ఎకరంన్నర భూమి ఉంది. వరి వేసి ఇటీవలే కోసిన. వడ్లను అమ్మేందుకు మార్కెట్కు తెచ్చిన. ఇంతకు ముందు ఇక్కడికి వస్తే తిండికి గోసపడేటోళ్లం. కడుపుమాడ్చుకునేటోళ్లం. కానీ ఇప్పుడు మాకు మధ్యాహ్నం భోజనం పెడుతున్నరు. చాలా సంతోషంగా ఉంది.
– గడ్డి కనకయ్య, కరీంనగర్