గొల్లపల్లి, నవంబర్ 11 : అన్ని వర్గాలతోపాటు దళితుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగులు, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గొల్లపల్లి మండలంలోని ఇస్రాజ్పల్లిలో శుక్రవారం మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నుంచి 20 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీ(బీ)ఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఇస్రాజ్పల్లి గ్రామంలో 90రోజుల పాటు కుట్టు శిక్షణ పొందిన 39 మంది మహిళలకు సర్టిఫికెట్లు, మిషన్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దళితుల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తెచ్చిందన్నారు. దీంతో డ్రైవర్లు, కూలీలుగా పనిచేసిన దళితులు వాహన యజమానులు, వ్యాపార వేత్తలుగా మారుతున్నారని పేర్కొన్నారు. ఏటా 2లక్షల మందికి దళితబంధు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
వ్యవసాయ భూమి లేని దళితులు, దళిత కూలీలు, మహిళలకు ఉపాధి కల్పించడానికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దళిత మహిళలకు కుట్టు మిషన్లో శిక్షణనిచ్చి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు అందించడంతో పాటు వారికి పని కల్పించనున్నట్లు పేర్కొన్నారు. కుట్టు శిక్షణ పొందిన మహిళలు రోజుకు రూ.300 నుంచి రూ.1000 సంపాదించేలా లక్ష్యాలు నిర్దేశించుకొని పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతాసురేశ్, జడ్పీటీసీ జలంధర్, ప్యాక్స్ చైర్మన్లు రాజసుమన్ రావు, వెంకట మాధవ రావు, సర్పంచ్ గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, వైస్ చైర్మన్ లింగారెడ్డి, టీ(బీ)ఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, రైతు బంధు సమితి సభ్యుడు కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.