రాజన్న సిరిసిల్ల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్(కరీంనగర్)/ పెద్దపల్లిటౌన్: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల, రాజ్యసభ సభ్యుడు వద్ధిరాజు రవిచంద్ర ఇండ్లపై ఈడీ, ఐటీ దాడులను నిరసిస్తూ గురువారం కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు తీశారు. కేంద్రం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దుమాల శ్రీకాంత్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అమిరిశెట్టి రామస్వామి మాట్లాడారు. కేంద్రం అభివృద్ధిని పక్కనబెట్టి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నదని నిప్పులు చెరిగారు. రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కారుకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మున్నూరుకాపు సంఘం నాయకులు బండారి వేణు, బోనాల శ్రీకాంత్, గందె మాధవి, నందెల్లి రమ, ఎడ్ల అశోక్, మహేశ్, బాలు, కర్ర రాజశేఖర్, కుమార్, సుధాకర్, హరికృష్ణ, ఐలయ్య, రాజేందర్, సత్తినేని శ్రీనివాస్, మధు పెద్దపల్లి జెడ్పీటీసీ సభ్యలు బండారు రాంమూర్తి, వ్యవసాయ మార్కెట్ ఉపాధ్యక్షుడు జడల సురేందర్, బారస పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజుకుమార్, మున్నురు కాపు సంఘం యువజన రాష్ట్ర కన్వీనర్ ఆకుల స్వామి వివేక్ పటేల్, నాయకులు ఉనుకొండ సునిల్, నాంసాని సరేశ్బాబు, ప్రకాశ్, తూముల శ్రీనివాస్ రావు, పెంచాల శ్రీధర్, న్యాయవాది వెంకన్న, ఆకుల చిరంజీవి, సిరిసిల్ల మమున్సిపల్ కౌన్సిలర్లు కల్లూరి మధు, రాజు, ఆకుల చిన్న, నాయకులు అగ్గిరాములు, భీమవరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈడీ దాడుల పేర రాజకీయ కుట్రలు
మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై జరిగిన ఈడీ దాడులను రాజకీయపరమైన కోణంలోనే చూడాలి. గతంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే దాడులు చేశామని చెప్తున్నప్పటికీ ఇది పూర్తిగా రాజకీయ కుట్రే. ఇటీవల మునుగోడులో బీజేపీ చిత్తుగా ఓడిపోవడం, నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు చేసిన కుట్ర బట్టభయలవడంతో రాష్ట్రంలో బీజేపీ పలుచనవుతుందని, టీఆర్ఎస్ మరింత బలపడుతోందని బీజేపీ అధినాయకత్వం టీఆర్ఎస్ నాయకులను సమాజంలో చులకన చేయాలనే ఉద్దేశంతో చేసిన కుట్ర ఇది. ఈ నెల 12న మోదీ పర్యటన నేపథ్యంలో టీఆర్ఎస్పై ఆరోపణలు చేయడానికి ఒక అవకాశం ఇవ్వాలని కుట్రపూరితంగా ఈడీ దాడులు చేశారు. ఈ దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలి.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే (గోదావరిఖని)