కార్పొరేషన్/ కొత్తపల్లి, నవంబర్ 10: ‘ఈడీలు, ఐటీ దాడులకు భయపడేటోడు తెలంగాణలో ఎవ్వరూ లేరు. బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి పచ్చని తెలంగాణలో విషంచిమ్ముతున్నది.’ అంటూ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం అని స్పష్టం చేశారు.
కరీంనగర్ను గొప్పగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ కొంటామన్నారు. గురువారం కరీంనగర్ 43వ డివిజన్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను మేయర్ వై సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో మామిండ్లపల్లి నుంచి పాత పల్లె హనుమాన్ టెంపుల్ వరకు 1.25 కోట్లతో బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ సీఎం అస్యూరెన్స్, స్మార్ట్సిటీ నిధులతో నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ప్రధాన, అంతర్గత రోడ్ల అభివృద్ధికి పెద్దమొత్తంలో నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణకు అధునాతన స్వీపింగ్ మిషన్లను తెప్పించామని పేర్కొన్నారు. తమపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించా రు. దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణ కోసం నన్ను హైదరాబాద్ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేద ని కొట్టిపారేశారు.
దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి, వారికి కావాల్సిన సమాచారమిచ్చేందుకే విదేశీ పర్యటన తిరిగివచ్చినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో కమిషనర్ సేవా ఇస్లావాత్, కార్పొరేటర్ సరిళ్ల ప్రసాద్, జయశ్రీ, గందె మాధవి, బోనాల శ్రీకాంత్, గంట కళ్యాణి, బండారి వేణు, టీఆర్ఎస్ నేత హరిశంకర్, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేశ్గౌడ్, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, సర్పంచు లు రాచమల్ల మధు, జినుక సంపత్, నాయిని ప్రసాద్, ఉప సర్పంచ్ మనోజ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షాబీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్గౌడ్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఉప్పు తిరుపతి, నాయకులు తాండ్ర శ్రీను, తాండ్ర నరేశ్, కంకణాల రమేశ్, కూన నాగరాజు పాల్గొన్నారు.