వేములవాడ, నవంబర్ 10: వేములవాడ ఏరియా దవాఖాన వైద్యుల పనితీరు అభినందనీయమని, వేములవాడలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలందుతున్నాయని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రశంసించారు. ప్రభుత్వం అందిస్తున్నందున సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేములవాడ ఏరియా దవాఖానను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటల్స్లో వైద్య సేవల కోసం వచ్చే రోగుల సంఖ్య ఏడాది కాలంలో మరింత పెరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా తన్నీరు హరీశ్ రావు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిందని, ఆయన ఎప్పటికప్పుడు నిర్వహించిన సమీక్షా సమావేశాల ద్వారా దవాఖానల్లో సేవలు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
గతంలో ఏడాదికి 78 లక్షల 50వేల మంది ఓపీ సేవలు వినియోగించుకోగా ఆ సంఖ్య ప్రస్తుతం కోటీ36లక్షలకు చేరిందన్నారు. గతంలో ఏడాదికి 67వేల శస్త్ర చికిత్సలు జరిగేవని, ప్రస్తుతం రెండు లక్షల 37వేల మందికి సేవలు అందించామని, లక్షా26వేల కాన్పులు కూడా చేశామని తెలిపారు. గాంధీ, ఉస్మానియా లాంటి దవాఖానల్లో జరిగే మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సలను వేములవాడలో ఇప్పటికే నిర్వహించారని గుర్తుచేశారు. దవాఖానకు అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులను కూడా కేటాయిస్తామని చెప్పారు. ఆయన వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, మురళీధర్ రావు, వైద్యాధికారులు అనిల్ కుమార్, సంతోష్చారి, తిరుపతి, కార్యాలయ పర్యవేక్షకులు నాగరాజు, స్టాఫ్ నర్సులు స్టెల్లా, భాగ్యలక్ష్మి ఉన్నారు.