కోల్సిటీ, నవంబర్ 10 : ‘మోదీ సారు ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మీరు ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న మీరు ఇప్పుడు ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం అంటూ అంబానీకి అమ్మేస్తారా..? ఆర్ఎఫ్సీఎల్ పునరుద్ధరించినంక మా ప్రాంత నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలిచ్చారు? మాపై ఎందుకీ వివక్ష? ఎందుకంత కక్ష?’ అంటూ గోదావరిఖని సీపీఐ పార్టీ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ నిప్పులు చెరిగారు. ‘గో బ్యాక్ మోదీ’ అనే ఫ్లెక్సీతో గురువారం గోదావరిఖనిలో నిరసన తెలిపారు. ప్రధానిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
ఈ సందర్భంగా దినేశ్ మాట్లాడుతూ, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ అధికారులతో గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు ధారాదత్తం చేస్తున్న మోదీ.. ఇప్పుడు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ లాంటి పరిశ్రమలను కూడా అమ్మేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సింగరేణికి చెందిన నాలుగు బ్లాకుల వేలాన్ని రద్దుచేసి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన రామగుండంలో భారీ పరిశ్రమల స్థాపనతో ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయి కాలుష్యపు కోరల్లో చిక్కుకొని అలమటిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి ఆర్ఎఫ్సీఎల్లో ఎలా ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు. ఆర్ఎఫ్సీఎల్ ద్వారా వెలువడే గ్యాస్తో ఈ ప్రాంత ప్రజల అనారోగ్యాల బారిన పడుతున్నారని గుర్తు చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి ప్రారంభమై ఏడాది అవుతుండగా ఇప్పుడు వచ్చి ప్రారంభించడం వెనుక ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. దయచేసి రామగుండానికి రావొద్దని, ఒకవేళ వస్తే సీపీఐ శ్రేణులు అడ్డుకుంటాయని తేల్చిచెప్పారు.