రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): విద్యుత్ బకాయిలున్న వినియోగదారులు ఎన్నికల్లో ఓటు వేయడం, పోటీ చేసేందుకు అనర్హులని ఎన్నికల అథారిటీ అధికారి సుమిత్రా తెలిపారు. సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఎన్నికలకు సంబంధించిన నియమాలను వెల్లడించారు. ఒక సభ్యుడికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా ఒకే ఓటు వర్తిస్తుందని, అందులో ఏ ఒక్క కనెక్షన్పైనా మూడు నెలల బకాయిలున్నా ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులని చెప్పారు. ఈనెల 16లోగా విద్యుత్ బకాయిలన్నీ చెల్లించి ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వినియోగదారులు తమకున్న విద్యుత్ కనెక్షన్ల వివరాలు సంస్థకు వెంటనే తెలుపాలని కోరారు. సంస్థకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక ఓటరు జాబితాను ప్రతి గ్రామ పంచాయతీలో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అభ్యంతారులుంటే మార్పులు, చేర్పుల కోసం సరైన ఆధారాలతో సమర్పించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంతానం ఇద్దరికంటే ఎక్కువ మించి ఉండరాదని, ముగ్గురు ఉన్నా పోటీకి అనర్హులని తెలిపారు. ఓటరు తుది జాబితా త్వరలో ప్రకటిస్తామన్నారు. సమావేశంలో డీసీవో బుద్ధానాయుడు, సెస్ ఎండీ రామకృష్ణ పాల్గొన్నారు.