కమాన్చౌరస్తా, నవంబర్ 9 : దేశంలో ‘గరీభీ హఠావో’ నినాదం ప్రారంభమై సంవత్సరాలు గడిచినా పేదలు అభివృద్ధి చెందడం లేదని రాష్ట్ర జనవరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కళాశాలలోని అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘75 సంవత్సరాల భారత ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు సావనీర్ను యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రావు మాట్లాడారు.
ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధించినా, ప్రజల మధ్య అంతరాలను తగ్గించడంలో ఇప్పటికీ వెనుకబడి ఉన్నదన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ మల్లేశ్ మాట్లాడుతూ 75 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగాయని, ఆర్థిక వృద్ధి హెచ్చుతగ్గులు అవుతుందని, పేదరికం, నిరుద్యోగం ఇంకా అనుకున్న స్థాయిలో మార్పు చెందడం లేదన్నారు. ప్రభుత్వాలు ప్రైవేట్ రంగానికి పెద్ద పీట వేస్తున్నాయని, ఇది మంచి పరిణామం కాదని అభిప్రాయపడ్డారు.
ముఖ్య ప్రసంగకర్తగా హాజరైన న్యూఢిల్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రొఫెసర్ పరవాకర్ సా హూ మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశం అన్ని రంగాల్లో వృద్ధి సాధించిందని గణాంకాలతో సహా వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధిని సాధిస్తుందని శాతవాహన విశ్వవిద్యాల రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్థశాస్త్ర విభాగం డాక్టర్ కోడూరి శ్రీవాణి మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్నదని వివరించారు. ఈ రెండు రోజుల జాతీయ సద స్సు ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, తర్వాత ఈవ్యాసాలను బుక్ లేదా జర్నల్ రూ పంలో ముద్రిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ టూ వీసీ డాక్టర్ వీ రమేశ్, ఆర్ట్స్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ నజీముద్దీన్ మునావర్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ ఎస్ సుజాత, ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి, డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.