రాంనగర్, నవంబర్ 9: భూ వివాదంలో మధ్యవర్తిగా వచ్చిన వ్యక్తిని వాహనంతో గుద్ది రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేసిన నిందితుల పై పీడీయాక్టు అమలు చేస్తూ సీపీ సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మే 8న రాత్రి 11 గంటల ప్రాంతంలో నగరంలోని ఆదర్శనగర్ బోర్డు వద్ద ఓ గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ప్రభుత్వ ఉపాధ్యాయులు రావుల శ్రీనివాస్, అతని భార్య రుషింద్రమణి తీవ్రంగా గాయపడ్డారు. దీనిని రోడ్డు ప్రమాదంగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా నంబర్ లేని వాహనం వారిని వెంబడించినట్లు గుర్తించి పథకం ప్రకారం హత్య చేసినట్లుగా నిర్ధారించుకున్నారు.
ఈ ఘటనలో నిందితులైన దుబ్బాసి పరశురాములు, అలియాస్ ప్రశాంత్ (26), బొల్లం శ్రీధర్ అలియాస్ చింటు (22) మామిడి వేణు (28)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జూలై 23న నిందితులు బెయిల్పై బయటికి వచ్చి బాధితులను తిరిగి బెదిరింపులకు గురిచేయడంతో వారిని అదుపులోకి తీసుకుని పీడీయాక్టు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను నిందితులకు అందజేసి చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తరలించారు. పీడీయాక్టు అమలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐ దామోదర్రెడ్డి, పీడీసెల్ ఇన్చార్జి ఫండరీలను సీపీ అభినందించారు.