కోల్సిటీ, నవంబర్ 9: ప్రధాని రామగుండం పర్యటనను అడ్డుకొని తీరుతామని సీపీఐ నగర కార్యదర్శి కే కనకరాజ్, సహయ కార్యదర్శి మద్దెల దినేశ్, రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, తాళ్లపల్లి మల్లయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య స్పష్టం చేశారు. రామగుండానికి వస్తున్న ప్రధాని మోదీ తిరిగి వెళ్లాక ఆర్ఎఫ్సీఎల్ను ఆదానీ, అంబానీలకు అంకితం చేస్తారని ఆరోపించారు. బుధవారం గోదావరిఖనిలోని ఆయా పార్టీల కార్యాలయాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో వారు మాట్లాడారు. కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమై ఏడాది దాటిన తర్వాత మళ్లీ ప్రారంభం చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఇప్పటికే సింగరేణిలో ప్రైవేట్ బీజం నాటిన మోదీని రామగుండానికి రానిస్తే త్వరలో సింగరేణి కంపెనీ పేరు అంబానీగా మారుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు అంకితం చేసేందుకేనా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ పరిశ్రమ స్థాపించినా కేంద్ర పరిశ్రమల చట్టం ప్రకారం స్థానిక నిరుద్యోగులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఆర్ఎఫ్సీఎల్లో ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ‘మోడీ గో బ్యాక్’ అంటూ 12వ తేదీన చేపట్టే నిరసనకు కమ్యూనిస్టులు, కార్మిక శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
సింగరేణి, ఎన్టీపీసీ, రైల్వే, పోస్టల్ సంస్థలను ప్రైవేట్పరం చేసేందుకు పెద్ద కుట్రనే జరుగుతుందన్నారు. స్థానికంగా జవహర్ నవోదయ విద్యాలయం, త్రిపుల్ ఐటీ, ఈఎస్ఐ దవాఖాన ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐతో ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో సీపీఐ, సీపీఎం నాయకులు ఉన్నారు.