గోదావరిఖని, నవంబర్ 9: ప్రధాని మోదీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బుధవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో విలేకరులతో ఏఐటీయూసీ (సింగరేణి విభాగం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ (సింగరేణి విభా గం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, సీఐటీయూ (సింగరేణి విభాగం) రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు.
సింగరేణిలో బొగ్గు బ్లాకులను ప్రైవేట్కు అప్పగించే చర్యలను ఇప్పటికే సింగరేణి కార్మికవర్గమంతా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసి అందోళనలు, సమ్మెలు చేపట్టారని చెప్పారు. సింగరేణిలో 11వ వేతన ఒప్పందం అమలు కాకుండా డీపీఐ గైడ్లైన్స్ తీసుకువచ్చారని, వారు చెప్పిన ప్రకారంగానే వేతనాలు పెంచాలని మోదీ ప్రభుత్వం షరతు విధించిందన్నారు. 20 ఏండ్లుగా పెన్షన్ పెంచకుండా, కార్మికుల ఇన్కంటాక్స్ను రద్దు చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఏడాదిన్నరగా ఎరువులు ఉత్పత్తి చేస్తున్న ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే పేరుతో ఇక్కడికి వస్తున్న మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ నెల 10న గనులపై కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపే కార్యక్రమం చేపడుతున్నామని, కార్మికులు తరలిరావాలని ఐఎన్టీయూసీ నాయకుడు జనక్ప్రసాద్ పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో కార్మికులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు మోదీ పర్యటనను అడ్డుకోవాలని కోరారు. ఇక్కడ ఏఐటీయూసీ నాయకులు ఎల్ ప్రకాశ్, రంగు శ్రీనివాస్, అరెల్లి పోశం, ఐఎన్టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, ధర్మపురి, రాజేందర్, సీఐటీయూ నాయకులు మెండె శ్రీనివాస్, మేదరి సారయ్య, ఆసరి మహేశ్, రాజమౌళి పాల్గొన్నారు.