కరీంనగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఎప్పటిలాగే వానకాలం సీజన్లోనూ పంటల దిగుబడిని అంచనా వేసేందుకు కరీంనగర్ జిల్లా ప్రణాళిక, వ్యవసాయ శాఖ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటకోత ప్రయోగాలు ముమ్మరంగా చేస్తున్నది. మొత్తంగా ఎంపిక చేసిన 276 ప్రదేశాల్లో ప్రధాన పంటలైన వరి, పత్తి, మక్కతోపాటు ఈ సారి పెసర, కందులు, ఎండు మిర్చిపై ప్రయోగాలు కొనసాగిస్తున్నది. పత్తి, మక్కలో దిగుబడులు తగ్గినట్లు, అక్కడక్కడా వరిలోనూ ప్రతికూల ప్రభావం కనిపించినట్లు గుర్తించింది. ఇందుకు వాతావరణంలో మార్పులు, అధిక వర్షాలే కారణమని భావిస్తున్నది.
ప్రతి సీజన్లో పంట కోత ప్రయోగాలు నిర్వహించడం వల్ల జిల్లా, రాష్ట్ర స్థాయిలో స్థూల ఉత్పత్తిని లెక్కించే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా పంట దిగుబడులు ఏ కారణం చేత తగ్గాయనే విషయాలు కూడా తెలిసి పోతాయి. వీటిని బట్టి రైతులకు అధికారులు సలహాలు, సూచనలు కూడా చేసే వీలుంటుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడులు తగ్గితే గతంలో బీమా కూడా వర్తించేది. వానకాలం, యాసంగి పంట సీజన్లో కోతకు వచ్చే దశలో ఈ ప్రయోగాలు నిర్వహిస్తారు.
వరిలో 5 మీటర్లు x 5 మీటర్ల చొప్పున, పత్తి, మక్క ఇతర పంటల్లో 10 మీటర్లు x10 మీటర్ల చొప్పున రైతుల క్షేత్రాల్లో ఈశాన్య దిశను పంట కోత ప్రయోగానికి ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన ప్రదేశంలో కోతలు నిర్వహించి ఎంత దిగుబడి వచ్చిందో తూకం వేస్తారు. దీన్ని బట్టి ఆ ప్రాంతంలో రానున్న దిగుబడిన అంచనా వేస్తారు. ఈ విధంగా ఈ వానకాలం సీజన్ కోసం జిల్లాలో 120 వరి, 46 మక్క, 46 పత్తి, 24 పెసర, 20 కంది, మరో 20 ఎండు మిర్చి పంటపై ప్రయోగాలు నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ ప్రణాళికను రూపొందించింది. వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఈ ప్రయోగాలు నిర్వహిస్తోంది. సీపీఓ కొమురయ్య, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ ఈ ప్రయోగాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖల పరిధిలోని అధికారులు, ఉద్యోగులు పంట కోత ప్రయోగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
రెండు పంటలపై ప్రతికూల ప్రభావం
జిల్లాలో ప్రస్తుతం ముమ్మరంగా పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. వరిలో తీసుకున్న 120లో చాలా వరకు పూర్తి చేశారు. అధిక వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరి దిగుబడిపై ప్రతికూల ప్రభావం కనిపించినట్లు ప్రయోగాల్లో పాల్గొంటున్న అధికారులు చెబుతున్నారు. గంగాధర, రామడుగు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో వరిలో నిర్వహించిన ప్రయోగాల్లో స్వల్పంగా దిగుబడులు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. ఈ మండలాల్లోని గ్రామాల్లో 10.200 నుంచి 14.000 కిలోల వరకు దిగుబడి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఎకరాకు 21 నుంచి 23 క్వింటాళ్ల వరకు ఈ ప్రాంతంలో దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నిజానికి జిల్లాలో సగటున వరి దిగుబడి ఎకరాకు 22 నుంచి 24 క్వింటాళ్లుగా పరిగణిస్తారు. అధిక వర్షాల కారణంగా వరిలో ఇలాంటి పరిస్థితి జిల్లాలోని మరి కొన్ని గ్రామాల్లోనూ కనిపించినట్లు చెబుతున్నారు.
అధిక వర్షాలు, ఇతర తెగుళ్ల కారణంగా పత్తి దిగుబడిపైనా ప్రభావం పడుతున్నది. పత్తి మొదటి పికింగ్లోనే గుంటకు 7.150 కిలోల సగటు దిగుబడి అంచనాకాగా ప్రస్తుతం 6.126 కిలోల సగటు దిగుబడి వచ్చినట్లు చెబుతున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పత్తి ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే 8 నుంచి 10 క్వింటాళ్ల వరకే వచ్చే అవకాశం ఉన్నట్లు పంట కోత ప్రయోగాల ద్వారా స్పష్టమవుతోంది. ఇక మరో ప్రధానమైన పంట మక్కపై తీవ్ర ప్రభావమే కనిపిస్తోంది. ఈ పంట ఎదుగుదల సమయంలో జిల్లాలో అధిక వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆశించిన దిగుబడులు రాలేదని అంటున్నారు. మక్క సగటు దిగుబడి ఎకరాకు 25 క్వింటాళ్లుగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుత సీజన్లో 10 నుంచి 15 క్వింటాళ్లే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రామడుగు మండలంలోని ఒక గ్రామంలో మక్క కోసం ఎంపిక చేసిన పంట కోత ప్రయోగం ప్రదేశంలో మొత్తానికి మొత్తం దిగుబడి రాలేదని అధికారులు తెలిపారు. చాలా వరకు తగ్గిన పెసర పంటను జిల్లాలో ప్రధానంగా పచ్చి రొట్ట ఎరువు కింద సాగు చేస్తారు. పప్పు కోసం సాగు చేసిన చోట ఎకరాకు 2.5 నుంచి 3 క్వింటాళ్ల సగటు దిగుబడి అంచనా. కానీ ఈ సారి 1 నుంచి 2 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన కంది, ఎండు మిర్చి దిగుబడులు వచ్చే సమయం జనవరిలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.