కమాన్చౌరస్తా, నవంబర్ 8: భక్తిమార్గంలో బహుదూర ప్రయాణం చేస్తూ శబరిమల అయ్యప్ప సన్నిధికి జిల్లా వాసులు పాదయాత్రగా బయలుదేరారు. ఓ వైపు ఆధ్యాత్మిక భావన, మరో వైపు ఆరోగ్యం రెండింటితో మనసుకు ప్రశాంతత కోసం అయ్యప్ప భక్తులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను దాటుకుంటూ 1400 కి.మీ దూరంలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని భగత్నగర్ అయ్యప్ప ఆలయం వద్ద గత నెల 9న గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర 45 రోజుల పాటు సాగనుంది.
22 సంవత్సరాలుగా..
2000 సంవత్సరంలో కరీంనగర్లో నలుగురితో శబరిమలకు పాదయాత్ర ప్రారంభమైంది. అప్పుడు హైదరాబాద్కు చెందిన వేణుగోపాల గురుస్వామి దీనికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన శిష్యుడు గడప నాగరాజు గురుస్వామి 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప సన్నిధానానికి మహా పాదయాత్రగా తాను వెళ్తూ, భక్తులను తీసుకెళ్తున్నారు. ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నది. ప్రస్తుతం 120 మందికి చేరింది.
ఉదయం 20 కిలో మీటర్లు..సాయంత్రం 12 కిలో మీటర్లు..
పాదయాత్రలో స్వాములు ప్రతి రోజు సుమారు 35 కిలో మీటర్ల మేర వారి నడక సాగిస్తారు. గురుస్వామి మార్గనిర్దేశాలను అనుసరిస్తూ ఉదయం 20 కిలోమీటర్లు, సాయంత్రం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది. మిగతా సమయంలో వారు మార్గమధ్యంలో వచ్చే ఆలయాలు, మందిరాల్లో సేదతీరుతారు. స్వాములకు కావాల్సిన సామగ్రిని డీసీఎం వ్యాన్లో తీసుకెళ్లారు.
అయ్యప్ప స్వామి ఆశీస్సులతో..
22 సంవత్సరాలుగా కరీంనగర్ నుంచి శబరిమలకు పాదయాత్ర చేస్తున్న. అయ్యప్ప స్వామి ఆశీస్సులతోనే ఇది సాధ్యమవుతున్నది. నాతో పాటు శబరిమలకు కాలినడకన వచ్చే స్వాముల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నది. ఇది సంతోషించదగ్గ విషయం. ఇలాంటి యాత్రలతో మరో నలుగురిని భక్తిమార్గం వైపు నడుపుతూ, నా గురువు వేణుగోపాల్ గురుస్వామి మార్గాన్ని చూపుతున్న.
– గడప నాగరాజు, గురుస్వామి
మరిచిపోలేని అనుభూతి
రెండో సారి మహాపాదయాత్రకు సంకల్పించి ముందుకు సాగుతున్న. ఇది మరిచిపోలేని అనుభూతి. మొదటి సారి మహా పాదయాత్ర చేసినప్పుడు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేనిది. అదే సంతోషంతో రెండోసారి యాత్రకు సిద్ధమయ్యా. గత నెల 9న ప్రారంభమైన మా యాత్ర కర్ణాటక రాష్ట్రం వరకు చేరుకుంది. యాత్రలో అయ్యప్ప నామస్మరణ చేస్తూ ముందుకు సాగుతున్నం.
– డీ సంపత్, గురుస్వామి, కరీంనగర్