మంత్రపురి మంథనిలో పేదల సొంతింటి కల సాకారం కాబోతున్నది. మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మవాడలో రెండేళ్ల క్రితమే 92 గృహాల సముదాయం పూర్తయినా.. లబ్ధిదారుల ఎంపిక జాబితాపై అభ్యంతరాలతో పంపిణీ ఆగిపోయింది. తాజాగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో అడ్డంకులన్నీ తొలగిపోగా, 74 మంది లబ్ధిదారులతో జాబితా సిద్ధమైంది. మిగతా 18 మందికి సంబంధించిన వివరాలను లోతుగా పునఃపరిశీలన చేస్తుండగా, త్వరలోనే గృహప్రవేశాలు చేయించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. గూడులేని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే అవకాశం రావడం తన అదృష్టమని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇండ్ల పంపిణీకి చొరవ చూపిన మంత్రి కొప్పుల ఈశ్వర్, సహకరించిన కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): పేద ల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని తెచ్చింది. దశలవారీగా నిర్మిస్తూ పేదలకు అందిస్తున్నది. 2017లో మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్, మంథని మేజర్ పంచాయతీ సర్పంచ్గా పుట్ట శైలజ ఉన్న సమయంలో పోచమ్మవాడలో జీ ప్లస్-వన్గా 92 ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అదే సమయంలో మేజర్ పంచాయతీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేసి ప్ర భుత్వానికి జాబితా పంపారు. రెండేళ్ల క్రితమే ఇండ్ల నిర్మాణాలు పూర్తికాగా జిల్లా యంత్రాంగం పంపిణీ చేసేందుకు సమాయత్తమైంది. కానీ, మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్బాబు గెలిచిన తర్వాత జాబితాపై అభ్యంతరం చెప్పడంతో ఇండ్ల పంపిణీ ప్రక్రియ ఆగిపోయింది. ఇండ్ల కేటాయింపు ఆలస్యం కావడం తో లబ్ధిదారులు నిరాశ చెందారు.
పలుసార్లు ఆందోళనకు కూడా దిగారు. డబుల్బెడ్రూం ఇండ్ల తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశాలు చేశారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు రంగప్రవేశం చేసి సర్దిచెప్పారు. ఆ తర్వాత జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, వృద్ధుల సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జడ్పీచైర్మన్ పుట్టమధూకర్, కలెక్టర్ డా.సర్వే సంగీత సత్యనారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక కోసం పలుసార్లు సమావేశాలను నిర్వహించారు. ఆ తర్వాత ఆర్డీవో నరసింహమూర్తి, తహసీల్దార్ బండ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఫీల్డ్ సర్వేచేసి 74 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ విషయమై డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కమిటీ చైర్మన్గా మంత్రి కొప్పుల ఈశ్వర్, కన్వీనర్గా కలెక్టర్ డా. సర్వే సంగీత సత్యనారాయణ, సభ్యులుగా జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలతో వర్చువల్గా ఈనెల 22, 23 తేదీల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరు కాగా, మంథని ఎమ్మెల్యే శ్రీధర్బాబు గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మంత్రి ఆమోదంతో 92 మంది లబ్ధిదారులకు 74 మంది ఎంపిక చేసి జాబితాను సిద్ధం చేశారు. అదే విధంగా లబ్ధిదారులకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు సైతం సిద్ధం చేశారు. ప్రస్తుతం పక్కన పెట్టిన 18 మంది లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలను మరింతగా లోతుగా పునఃపరిశీలన చేయనున్నారు. వారికి కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవ తేదీని ప్రకటించగానే, లాంఛనంగా గృహ ప్రవేశాలు చేయనున్నారు.
పేదలకు ఇండ్లిచ్చే అవకాశం రావడం అదృష్టం
నేను ఎమ్మెల్యేగా మంథని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో సీఎం కేసీఆర్ పేద కుటుంబాలకు నిలువ నీడను ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. గూడులేని నిరుపేదలైన మంథనిలోని 74 మంది పేద బిడ్డలకు ఇండ్లు ఇచ్చే అవకాశం రావడం నా అదృష్టం. పేదలకు ఇండ్ల పంపిణీకి చొరవ చూపిన మంత్రి కొప్పుల ఈశ్వర్, సహకరించిన కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
-పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్ (పెద్దపల్లి)
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఇండ్లు లేని పేదవారికి ఇండ్లు కట్టిచ్చే బృహత్తర పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. ముందు చూపు, దార్శనికతతో మంథని మున్సిపల్ పరిధిలోని 92మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-పుట్ట శైలజ, మున్సిపల్ చైర్పర్సన్ (మంథని)