తక్కువ ఖర్చు, సోలార్ విద్యుత్తో పనిచేసే బహుళ వినియోగ ఎలక్ట్రిక్ వీడర్, స్ప్రేయింగ్ యంత్రం.. గాలి, నీరు ఆధారంగా పొలాల్లో ఉన్న మోటర్లను సులువుగా ఉన్న చోటు నుంచే ఆన్, ఆఫ్ చేసే మెషీన్.. ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించే ఇన్స్టంట్ ప్యాడీ డ్రైయర్.. కదల్లేని పేషెంట్లకు చేయూతనిచ్చే మల్టీపర్పస్ బెడ్.. తక్కువ ఖర్చుతో ఆఫీస్ ఫైల్స్ను, కాగితపు వస్తువులను శుభ్రం చేసే యూవీ లైట్ శానిటేషన్ బాక్స్.. ఇలా అద్భుతమైన ఆవిష్కరణలతో ఔరా అనిపించారు మన గ్రామీణ ఇన్నోవేటర్స్! సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తున్న టీహబ్లో నాలుగు రోజుల క్రితం ‘పించ్ ఇన్ ద రింగ్ – మన ఇన్నోవేటర్ కథలు’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఔరా అనిపించారు! వినూత్న ఆవిష్కరణలతో అబ్బుపరుచగా, అందులో రైతులతోపాటు సామాన్యులకు మేలు చేసేవే ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఔత్సాహికులను విశేషంగా ఆకర్షించాయి. వీటిని చూసిన కొందరు మార్కెటింగ్ మద్దతు అందించేందుకు ముందుకొస్తే.. మరికొందరు ఉత్పత్తుల తయారీకి పెట్టుబడులు పెడుతామని చెప్పడంతో ఆవిష్కర్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
జగిత్యాల/ పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 22: గ్రామీణుల వినూత్న ఆవిష్కరణలకు మాదాపూర్లోని ‘టీ హబ్ ఫేస్- 2’ వేదికైంది. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ‘పించ్ ఇన్ ద రింగ్- మన ఇన్నోవేటర్ కథలు’ పేరిట నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కార్యక్రమం ఔరా అనిపించింది. ‘సమస్య మీది.. పరిష్కారం మాది’ అన్నట్లుగా రైతులు, వృద్ధులు, ఇతర వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలకు చక్కటి పరిష్కారమార్గాలను చూపారు. ఒకటి కాదు.. రెండు కాదు పదుల సంఖ్యలో ఆవిష్కరణలను ప్రదర్శించారు. అందులో మన ఉమ్మడి జిల్లా నుంచి పదుల సంఖ్యలో ఆవిష్కర్తలు తమ ఇనోవేషన్స్ను ప్రదర్శించి సత్తాచాటారు. ఆవిష్కర్తల పట్టుదలను ప్రత్యక్షంగా చూసిన పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ఎంపిక చేసిన 23 గ్రామీణ ఆవిష్కరణల్లో 21 ఆవిష్కరణల వివరాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా తెలుసుకున్నారు. మొత్తం 49 మంది ఆయా ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని టీఎస్ఐఐసీ ప్రతినిధి ప్రణయ్ తెలిపారు. కొంతమంది మార్గదర్శకులుగా, మార్కెటింగ్ మద్దతు అందించేందుకు స్పాన్సర్లుగా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేందుకు ముందుకు వచ్చారు.
పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రైతు గోనె కిషన్కుమార్ వరిధాన్యం ఆరబెట్టడంలో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయానా అనుభవించాడు. దీనికోసం ఓ పరికరం రూపొందించాలనుకున్నాడు. అందులో భాగంగానే ఇన్స్టంట్ ప్యాడీ డ్రయర్ ఆవిష్కరించాడు. ఈ మిషన్ ద్వారా వరి ధాన్యం నుంచి తేమ శాతాన్ని నిమిషాల వ్యవధిలో 17 శాతం తగ్గించి, రైతుకు ఇవ్వవచ్చు. దీనివల్ల రైతులకు 10 నుంచి 15 రోజుల శారీరక శ్రమ తగ్గుతుంది. లేబర్ సమస్య ఉండదు. సమయంతో పాటు ఎకరాకు 1500 ఆదా అవుతుంది. వర్షాలతో ధాన్యం తడిసినప్పుడు మొలకలు రాకుండా, నలుపు రంగులోకి మారకుండా ఈ డ్రయర్ ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
– గోనె కిషన్కుమార్, సుద్దపల్లి (పెగడపల్లి)
సమాజానికి ఉపయోగపడేలా ఏదైనా తయారు చేయాలనే తపనతో కొత్త కొత్త ఇన్నోవేటర్లు ఆవిష్కరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు పసరగొండ రామకృష్ణ. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఓపెన్కాస్ట్ మైన్ వన్ ఆర్జీ-3 ఏరియాలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పని చేస్తున్న ఆయన, తాజాగా యూవీ లైట్ శానిటైజేషన్ బాక్స్ను ఆవిష్కరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం జరిగేలా ఈ ఇన్నోవేటర్ను రూపొందించాడు. పేపర్ ద్వారా సంక్రమించే అన్ని రకాల క్రిములను అంతం చేసేందుకు వీలుగా ఇందులో యూవీలైట్స్ అమర్చాడు. ఈ బాక్స్తో అన్ని ఆఫీసుల్లోని ఫైల్స్, పుస్తకాలు శుభ్రం చేసుకోవచ్చు. కేవలం 20 సెకండ్లలోనే పేపర్లు, ఫైల్స్పై ఉన్న దుమ్ము, సూక్ష్మక్రిములను తొలగించుకోవచ్చు. దీని తయారీ ఖర్చు వెయ్యి మాత్రమే అవుతుందని రామకృష్ణ చెబుతున్నాడు.
గ్రామీణ ఆవిష్కర్తలు వ్యవసాయ రంగంపైనే ఎక్కువగా ఆవిష్కరణలు రూపొందించారు. తమ చుట్టూ ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించి ఈ ఆవిష్కరణలకు రూపమిచ్చారు. ఇలాంటి ఆవిష్కరణలను పెట్టుబడిదారులు ప్రోత్సహించాలి. వీరిని ప్రోత్సహిస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఎంతో పట్టుదలతో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, గ్రామాలకు తెలిసేలా చేసి, ఈ రోజు అత్యుత్తమైన 23 గ్రామీణ ఆవిష్కర్తలను మీకు పరిచేయం చేసింది. పెట్టుబడిదారులు మరింత సమాచారం కోసం, సందేహాల నివృత్తి కోసం గ్రామీణ ఆవిష్కర్తలతో సమావేశమైన తర్వాతనే పెట్టుబడుల గురించి ఆలోచించండి. ఇది ఒక పవిత్రమైన కర్తవ్యంగా భావించండి. ఒక సమస్యను పరిష్కరించడం ద్వారా సమాజంలో ఎంతో మంది ప్రయోజనం పొందుతారు.
– జయేశ్ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
పంటపొలాల్లో ఏర్పాటు చేసిన మోటార్లను ఆన్, ఆఫ్ చేయాలంటే స్వయంగా రైతులు మోటార్ వద్దకు రోజులో రెండు, మూడు సార్లు వెళ్లాల్సి వస్తుంది. పొలాలు దూరంలో ఉంటే బైక్పైనే వెళ్తుంటారు. ఇలా అయితే పెట్రోల్ ఖర్చు రోజుకు 40 వరకు అవుతుంది. నాలుగు నెలల పంట కాలానికి కేవలం ఒక్క రైతుకు అయ్యే ఖర్చు దాదాపు 4,800. దీంతోపాటు సమయం కూడా వృథా అవుతుంది. ఇతర పని చేసుకునే వీలుండదు. అంతే కాదు, హడావుడిలో ఆన్, ఆఫ్ చేసే క్రమంలో మోటర్ వద్ద విద్యుత్ ప్రమాదాలకు గురై మరణిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. రాత్రి వేళల్లో వెళ్లినప్పుడు విషపురుగుల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మల్లాపూర్కు చెందిన వృత్తి రీత్యా స్వయంగా రైతు అయిన మెండె శ్రీనివాస్ తోటి రైతుల కోసం సరికొత్త ఆవిష్కరణ చేశాడు. గాలి నీరు ఆధారంతో పనిచేసే ‘ఆటోమెటిక్ రోబో టూ టర్న్ ఆన్, ఆఫ్ మోటర్ యూజింగ్ ఎయిర్ అండ్ వాటర్ సిస్టమ్’ను కనుగొన్నాడు. ఈ సిస్టమ్తో రైతులు మోటార్ల వద్దకు వెళ్లకుండానే ఉన్నచోట నుంచే సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్యాక్టరీలు, వ్యవసాయం, చెరువుల వద్ద ఉపయోగించవచ్చు. పైగా పంట పొలాల్లో మోటార్ ఎంత సేపు నడవాలో టైమ్ సెట్ చేస్తే మనం సెట్ చేసే సమయానికి ఆటోమెటిక్గా ఆఫ్ అయ్యేలా టైమర్ ఉంది. దీని సాయంతో మోటార్లను సెట్ చేసిన సమయానికి ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. అంతే కాదు, ఈ విధానం వల్ల మోటర్ కాలిపోయే అవకాశాలు తక్కువ.
వెల్గటూర్ మండలం కిషన్రావుపేటకు చెందిన వింజమూరి అంజయ్య వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. రైతులకు తక్కువ ఖర్చుతో బహుళ ప్రయోజనాలు కలిగేలా సరికొత్త ఆవిష్కరణ చేశారు. మల్టీపర్పస్ సోలార్ అండ్ ఎలక్ట్రికల్ వీడర్ అండ్ స్ప్రేయర్ను రూపొందించాడు. దీని ద్వారా పత్తి, మిర్చి, మక వంటి పంటల్లో సులభంగా కలుపు తీసుకోవచ్చు. సౌర శక్తిని విద్యుత్గా మార్చుకొని ఇది పనిచేస్తుంది. దీనికి పెట్రోల్, డీజిల్ అవసరము ఉండదు. ఈ వీడర్కు సింగిల్ వీల్ అమర్చారు. ఇది పని చేసినప్పుడు దాని ద్వారా మళ్లీ విద్యుత్ రీజనరేట్ అవుతుంది. రైతు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు దీంతో నిరంతరాయంగా కలుపు తీసుకోవచ్చు. పురుగుల మందు పిచికారీ చేయవచ్చు. ధాన్యం నేర్పుకోవచ్చు. సౌరశక్తితో నడవడం వల్ల రైతుకు ఖర్చు తగ్గుతుంది. మహిళా రైతులు కూడా దీనిని సులభంగా ఆపరేట్ చేయవచ్చు.