ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామానికి చెందిన జింకిరి రవీందర్- స్వరూప దంపతులకు ముగ్గురు సంతానం. శివాని(21), కల్యాణి (19), భవాని (17). వీరు పుట్టుకతోనే అంధులు. అయినా, ఆ తల్లిదండ్రులు ఏనాడూ అధైర్య పడలేదు. వారిని ఉన్నతంగా చూడాలని భావించారు. తమకున్న ఎకరంలో సాగుచేస్తూ కూలీ నాలీ చేసుకుంటూ వారిని ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ముందుగా హన్మకొండలోని అంధుల పాఠశాలలో చేర్పించి పదో తరగతి వరకు చదివించారు. ఆ తర్వాత వారు హైదరాబాద్లోని చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నారు. శివాని డిగ్రీలో బీఏ పూర్తి చేయగా, కళ్యాణి డిగ్రీ ఫైనల్ ఇయర్, భవాని డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
ప్రస్తుతం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తుండడంతో పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. శివాని ప్రస్తుతం గ్రూప్స్కు సన్నద్ధమవుతున్నది. బ్రెయిలీ లిపిలో ల్యాప్టాప్ ద్వారా అభ్యసిస్తున్నారు. సెల్ఫోన్లో అన్ని ఫీచర్లను ఆపరేట్ చేస్తున్నారు. విధి ఆ కుటుంబాన్ని చిన్నచూపు చూసినా పట్టుదలతో ముందుకుసాగుతున్న వారిని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. కాగా, ముగ్గురికీ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ 3,016 చొప్పున అందజేస్తున్నది. గ్రూప్స్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వీరికి రీడింగ్ స్కానర్ అవసరమవడంతో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్రెడ్డి ఇటీవల వితరణ చేశారు. కాగా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్లో ఉద్యోగం సాధిస్తానని పెద్ద కూతురు శివాని ధీమా వ్యక్తం చేస్తున్నది.
ముగ్గురు ఆడపిల్లలు పుట్టుకతో అంధులు.. అయినా ఆ పేద తల్లిదండ్రులు కుంగిపోలేదు.. బిడ్డల తలరాతను మార్చాలని సంకల్పించారు. ఉన్నత చదువులవైపు నడిపించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఆ అక్కాచెల్లెళ్లు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఒక్కో మెట్టును అధిరోహిస్తూ ఉన్నతవిద్యను అభ్యసిస్తూ కన్నవారి కలలను సాకారం చేసే దిశగా దూసుకెళ్తున్నారు.
– ఓదెల, అక్టోబర్ 22