కార్పొరేషన్, అక్టోబర్ 22: కిసాన్నగర్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. నగరంలోని 3వ డివిజన్లో శనివారం ఆయన మంచినీటి పైపులైన్, డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, శివారు ప్రాంతమైన కిసాన్నగర్లో గతంలో నిర్మించిన డ్రైనేజీలు, మంచినీటి పైపులైన్లు శిథిలావస్థకు చేరాయన్నారు.
వీటిని పునర్నిర్మించాలన్న ప్రజల వినతి మేరకు నిధులు కేటాయించి పనులు చేపడుతున్నామన్నారు. నగరంలో అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు, ప్రజలు అడిగిన చౌరస్తాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శివారు డివిజన్లలో రోజు మంచినీటి సరఫరా చేసేందుకు రూ. 6 కోట్లతో మంచినీటి పైపులైన్ల పనులకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనుల్లో జాప్యం జరుగుతోందని, రెండు నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని, సకాలంలో పనులు పూర్తి కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పనులు చేపట్టకపోతే ఆ పనులను రద్దు చేసి రీ టెండర్ పిలుస్తామని తెలిపారు. శివారు డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు 33 శాతం నిధులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వీధిలో మంచినీటి పైపులైన్, డ్రైనేజీలు, రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో మరో 20 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.
వీటితో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నగర చౌరస్తాలను సుందరీకరణ చేస్తున్నామని, వీటితో పాటు ప్రజల శారీరక ఆరోగ్యం కోసం ఓపెన్ జిమ్స్, వాకింగ్ ట్రాక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. నగరాన్ని సుందరంగా, క్లీన్ సీటిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, శ్రీధర్, అనిల్, మధు, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.