కమాన్చౌరస్తా, అక్టోబర్ 22: జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో శనివారం ముందస్తు దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. కాగా, నగరంలోని అల్ఫోర్స్, పారమిత ఎక్స్ప్లోరికా, బ్లూబెల్స్, భగవతి, సిద్ధార్థ, సెయింట్ పాల్స్ పాఠశాలల్లో విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై బంతి పూల మధ్య దీపాలు వెలిగించారు. అల్ఫోర్స్ పాఠశాలలో నిర్వహించిన వేడుకలకు విద్యాసంస్థల చైర్మన్ వీ నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. పండుగల విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. సిద్ధార్థ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో నిర్వహించిన వేడుకలను విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ దాసరి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులు పటాకులు కాల్చి ఆనందంగా గడిపారు.
కొత్తపల్లి, అక్టోబర్ 22: నగరంలోని మానేరు పాఠశాల ఆవరణను మామిడాకులు, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని లక్ష్మీపూజ చేశారు. అంతకుముందు ఈ వేడుకలను మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ వేడుకల్లో విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గంగాధర, అక్టోబర్ 22: మధురానగర్లోని విన్నర్స్ ఎడ్జ్ పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు దీపాలు వెలిగించి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లయ్య దీపావళి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రామడుగు, అక్టోబర్ 22: మండలంలోని పలు పాఠశాలల్లో ముందస్తు దీపావళి సంబురాలు ఘనంగా నిర్వహించారు. గోపాల్రావుపేటలోని అక్షర పాఠశాలలో చిన్నారులు వివిధ వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో అక్షర పాఠశాల కరస్పాండెంట్ మినుకుల మునీందర్, ప్రిన్సిపాల్ రాధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే, అల్ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.