కలెక్టరేట్, అక్టోబర్ 22: నీటి నిల్వ, అవసరం మేరకు వాడుకోవడం, వృథాను అరికట్టడంతోపాటు అడవుల పెంపకం, సంరక్షణలో కరీంనగర్ జిల్లా దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నదని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి, నీతి ఆయోగ్ బృందం డిప్యూటీ సెక్రటరీ షోయెబ్ అహ్మద్ కలాల్ స్పష్టం చేశారు. బెంగళూర్లాంటి మహానగర అభివృద్ధితో కరీంనగర్ పోటీ పడుతున్నదని, సౌతిండియాలో ఉన్న నగరాల కంటే బాగున్నదని కితాబిచ్చారు.
శనివారం కరీంనగర్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో భూగర్భ జలవనరుల శాఖ, డీఆర్డీవో, నీటి పారుదల శాఖ, అటవీ శాఖాధికారులతో కలిసి జిల్లా ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వాటిని పొ దుపుగా వాడుకోవాలని సూచించారు. అవసరానికి మించి వాడుకుంటే కాలక్రమేణా తగ్గిపోయి, భవిష్యత్ తరాలకు అవసరం మేరకు అందించడం కష్టసాధ్యమవుతుందన్నారు. నీటి సంరక్షణ బాధ్యతలు చేపట్టి, కొనసాగించాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల భూముల్లో మొత్తం వరి పంట సాగుచేస్తున్నారని, దీనికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే లా అధికార యంత్రాంగం ప్రోత్సహించాలన్నా రు.
జిల్లాలోని ప్రతి గ్రామం పారిశుధ్యం, పచ్చదనం, వ్యవసాయం తదితర అంశాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించి ముందువరుసలో నిలిచిందన్నారు. వీటి నిర్వహణలో కూడా ప్రజల భాగస్వామ్యం అత్యద్భుతమని కొనియాడారు. జిల్లా లో 75 అమృత్ సరోవర్ నిర్మాణాలు చేపట్టగా, ఎనిమిది పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వాటిని కూడా తొమ్మిది నెలల్లో పూర్తిచేయాలని సూచించారు. అన్ని శాఖలు సత్సంబంధాలు, సమన్వయంతో ముందుకు సాగుతుండడంతోనే అభివృద్ధి సాధ్యమైందని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారయంత్రాంగాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ను ప్రత్యేకంగా అభినందించారు.
కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ, జిల్లాలో వానకాలం, యాసంగి సీజన్లలో వరితోపాటు ఇతర పం టల సాగుపై అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ఆయిల్పామ్ సాగుపై రైతుల్లో చైతన్యం తేవడంతోపాటు సాగు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఇరువురు కేంద్ర బృంద అధికారులకు కలెక్టర్ శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో ఎల్ శ్రీలతరెడ్డి, డీఎఫ్వో బాలమణి, జిల్లా ఇరిగేషన్ అధికారి అస్మత్ అలీ, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, భూగర్భజలశాఖ ఉప సంచాలకురాలు సీహెచ్ శైలశ్రీ మల్లికాదేవి, డీఆర్డీవో ఏపీడీ సంధ్యారాణి పాల్గొన్నారు.