ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట నిలుపుకొన్నారు. ఆగస్టు 29న పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు. జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విజ్ఞప్తి మేరకు జిల్లా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆ రోజే ప్రకటించిన ఆయన, తాజాగా 30.60 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కాగా, జడ్పీ చైర్మన్తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ) : ఆగస్టు 29న సీఎం కేసీఆర్ పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీని అమలు చేశారు. జిల్లాలోని 266 గ్రామ పంచాయతీలతోపాటు రామగుండం కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.
ఈ మేరకు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. నిధుల మంజూరీకి విజ్ఞప్తి చేసిన జడ్పీ చైర్మన్ను సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, రామగుండం కార్పొరేషన్తోపాటు మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా, జీవో నెంబర్ 294 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, రామగుండం, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లోని మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కావాలని విజ్ఞప్తి చేశా. నేను ఇచ్చిన వినతి పత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి అంశంపైనా స్పందించారు. బహిరంగ సభా వేదికగా వినతి పత్రంలోని ఒక్కో అంశాన్ని చెప్పారు. రామగుండం కార్పొరేషన్, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలతో పాటు 266 గ్రామ పంచాయతీల అభివృద్ధికి 30.60 కోట్ల నిధులను విడుదల చేశారు. ఇదీ సీఎం కేసీఆర్కు అభివృద్ధిపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి, సహకరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్కు జిల్లా ప్రజల తరఫున నా కృతజ్ఞతలు.
– పుట్ట మధూకర్, జడ్పీ చైర్మన్ (పెద్దపల్లి)