కరీంనగర్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ సూక్ష్మ పోషకాలు గల పౌష్టిక అల్పాహారాన్ని ఉదయం పూట ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ శ్రీకారం చుట్టబోతున్నారు. అతి త్వరలోనే ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చి.. విద్యార్థుల్లో శారీరక పరిపుష్టిని కల్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాలను వినోద్కుమార్ ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం బెంగళూర్ శివారులోని ముద్దెనహళ్లి సాయినగర్లో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన సాయితో ఇటీవల సమావేశమైనట్లు తెలిపారు. సదరు ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పౌష్టికాహారం సరఫరా కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించామని చెప్పారు. ఆ ట్రస్ట్ సహకారంతో త్వరలోనే ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లాలో అమలు చేస్తామని, ప్రభుత్వ విద్యార్థులందరికీ సూక్ష్మ పోషకాలు గల పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన, అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన బాలబాలికలకు శారీరక పరిపుష్టి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విటమిన్స్, మినరల్స్తో కూడిన పౌష్టిక అల్పాహారం, రాగి జావ, చాక్లెట్ ఫ్లేవర్ పానీయం, సాయి పౌష్టిక ద్రావణం అందించడం ద్వారా హిడెన్ హంగర్ దూరమవుతుందన్నారు. ఈ కార్యక్రమ అమలుకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు సూచించినట్లు తెలిపారు.
–