జగిత్యాల, అక్టోబర్ 15: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆదివారం గ్రూప్-1 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జీ రవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలీకాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. జిల్లాలో జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు కొడిమ్యాల జేఎన్టీయూ, పొలాస వ్యవసాయ కళాశాలలో కలిపి 21 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గ్రూప్-1 పరీక్షకు 6,885 మంది హాజరవుతారన్నారు. ఒకటి నుంచి 5 రూట్లలో సెంటర్లను ఏర్పాటు చేసి ఎలాంటి అటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బీఎస్ లత, అరుణశ్రీ, ఆర్డీలు, డీఈవో, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
కొడిమ్యాల, ఆక్టోబర్ 15 : నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో గ్రూప్-1 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్ తెలిపారు. పరీక్షా సమయం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు ఉంటుందన్నారు. ఇక్కడ 744 మంది పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. అభ్యర్థులను ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. 10.15 గంటలకు గేట్ మూసివేస్తారన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ , ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
జగిత్యాల, అక్టోబర్ 15 : కరీంనగర్ నుంచి జగిత్యాల, జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్లే గ్రూప్-1 అభ్యర్థులు తమ ప్రయాణాన్ని గంట ముందుగానే ప్రారంభించాలని ఎస్పీ సింధూశర్మ సూచించారు. జగిత్యాల – కరీంనగర్ జాతీయ రహదారిపై గంగాధర రైల్వే గేటు వద్ద ట్రాక్ మరమ్మతులు జరుగుతున్న దృష్ట్యా కరీంనగర్ నుంచి జగిత్యాలకు వచ్చే గ్రూప్ -1 రాసే అభ్యర్థులు గంగాధర నుంచి వయా బూరుగుపల్లి, తాటిపల్లి, మల్యాల, మల్యాల ఎక్స్ రోడ్ వరకు సింగిల్ రోడ్డు ఉన్న దృష్ట్యా ప్రయాణ సమయం గంట ఎకువఅవుతుందన్నారు. అభ్యర్థులు ప్రయాణాన్ని గంట ముందుగా ప్లాన్ చేసుకొని పరీక్షా కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకు చేరుకోవాలని సూచించారు.
కొడిమ్యాల, ఆక్టోబర్ 15 : మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం గ్రూప్ -1 పరీక్ష రాసే అభ్యర్థులు సెంటర్కు వచ్చే ప్రయాణాన్ని గంట ముందుగా ప్రారంభించాలని ఎస్ఐ వెంకట్రావ్ తెలిపారు. మండలంలోని నమిలకొండ గ్రామంలో జగిత్యాల -కరీంనగర్ ప్రధాన రహదారిపై రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. కరీంనగర్ నుంచి వచ్చే అభ్యర్థులు గంగాధర వయా బూర్గుపల్లి, తాటిపల్లి మల్యాల ఎక్స్రోడ్డు కొండగట్టు నుంచి జేఎన్టీయూ కళాశాలకు చేరుకోవచ్చాన్నారు. సింగిల్ రోడ్డు ఉన్నందున ప్రయాణం అలస్యం అవుతుందన్నారు. ఉదయం 8.30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు.