కార్పొరేషన్, అక్టోబర్ 10: నగరంలోని టవర్సర్కిల్లో చేపడుతున్న స్మార్ట్సిటీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చే యాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో స్మార్ట్సిటీ, కేబుల్ బ్రిడ్జి పనుల పురోగతిపై సోమవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్ను సుం దరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నదని, మున్సిపల్గా ఉన్నప్పుడు 2.50 లక్షల మంది నివసించారని, ఇప్పుడు 4లక్షల మంది నివసిస్తున్నారని తెలిపారు.
ఇతర ప్రాంతాల నుంచి నగరానికి ప్రతి రోజూ 40 నుంచి 50 వేల మంది వచ్చి పోతున్నారన్నారు. జనాభా పెరుగుతుంటే రోడ్లు కబ్జాలకు గురై కుచించుకుపోయి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. టవర్సర్కిల్ ప్రాంతానికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ఈ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం తలెత్తితే కనీసం అంబులెన్స్, ఫైర్ ఇంజన్ వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. చిరు వ్యాపారులు రోడ్లపై వ్యాపారం చేయొద్దని, వారికి ప్రత్యామ్నాయంగా ఇంటిగ్రేటెడ్ మారెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లను వ్యాపారులు ఆక్రమించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ క్లీన్సిటీగా ఉంటేనే పెద్ద కంపెనీలు నగరానికి వచ్చే అవకాశముందన్నారు. స్మార్ట్సిటీ పనులను నెల రోజులలోగా పూర్తిచేసి టవర్సరిల్ కళకళలాడేలా చూడాలన్నారు. రేయింబవళ్లు పనిచేసి కేబుల్ బ్రిడ్జిని డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
టవర్సర్కిల్లో రోడ్డు ఆక్రమణలను తొలగింపునకు స్థానిక వ్యాపారులు, నగరవాసులు సహకరించాలని మంత్రి గంగుల కోరారు. సోమవారం ఉదయం టవర్సర్కిల్ లో స్మార్ట్సిటీ పనులను పరిశీలించారు. పోస్టాఫీస్, పండ్ల మార్కెట్, వెంకటేశ్వర మార్కెట్ రోడ్డులో పర్యటించి వ్యాపారులు, వీధి వ్యాపారులతో ముచ్చటించారు. రోడ్లపై వ్యాపారాలు, వాహనాల పార్కింగ్తో ట్రాఫిక్కు ఇబ్బందులు వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు అందరూ సహకరించాలని సూచించారు. వ్యాపారులు కూడా రోడ్డు పార్కింగ్ లేకుండా చూస్తామని, అయితే అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యాపార కూడలిలో ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణలను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటామన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామని, అక్కడే వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇప్పటికే నగరంలో నాలుగు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిర్మిస్తున్నామన్నారు. టవర్సర్కిల్లో పాత కాంట్రాక్టర్ను తొలగించి నూతన కాంట్రాక్టర్కు పనులను అప్పగించి వేగంగా పూర్తి చేయిస్తామన్నారు.
నగరం సుందరంగా ఉండేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, సీపీ వీ సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీసీపీ శ్రీనివాస్, ఏసీబీ తుల శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్బీ ఈఈ సాంబశివరావు, మున్సిపల్ ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు ఉన్నారు.