జాతిపిత మహాత్మాగాంధీ మార్గం అనుసరణీయమని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని నేతలు కొనియాడారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం గాంధీజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. గాంధీజీ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నెరవేరుతున్నదని ఉద్ఘాటించారు.
– నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 2
గాంధీజీ మార్గం అనుసరనీయమని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని కోతిరాంపూర్లో ఉన్న గాంధీ విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పూలమాల వేసి నివాళులర్పించారు. చొప్పదండి పట్టణంలోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్దపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గాంధీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన జయంతి వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని గాంధీనగర్లో జరిగిన కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు హాజరై గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. జగిత్యాల జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ గాంధీజీ మహనీయుడని, ఆయన ఆడుగుజాడల్లో నడిచి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.