కళోత్సవం.. గ్రాండ్ సక్సెస్ అయింది. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం వేదికగా దేశ, విదేశాల్లోని ప్రముఖ కళాకారులతో నృత్య ప్రదర్శనలు.. రాష్ట్రంలోని ప్రఖ్యాత ఫోక్, సినీ సింగర్ల గీతాలాపణలతో మూడు రోజుల వేడుక నగర ప్రజలను ఉర్రూతలూగించింది. చివరి రోజు ఆదివారం మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, మంత్రి గంగులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయగా, మైదానమంతా కిక్కిరిసిపోయింది. అంతకుముందు సర్కస్ గ్రౌండ్ నుంచి స్టేడియం దాకా తీసిన శోభాయాత్ర నగరవాసుల్లో ఫుల్ జోష్ నింపగా, ఈ సందర్భంగా కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఫోక్ సింగర్ల పాటలు అలరించాయి. సాయంత్రం 7:30 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ప్రోగ్రామ్స్ సాగగా, మంత్రి కేటీఆర్ దాదాపు మూడున్నర గంటల సేపు ఓపిగ్గా వీక్షించారు. అనంతరం కళాకారులు, నిర్వాహకులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు.
కమాన్చౌరస్తా, అక్టోబర్ 2: కళోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. అంబేద్కర్ స్టేడియం వేదికగా మూడురోజులుగా అట్టహాసంగా సాగాయి. కాగా, చివరి రోజు నగరంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానం(సర్కస్ గ్రౌండ్) నుంచి ప్రారంభమైన శోభాయాత్ర అంబేద్కర్ స్టేడియం దాకా కనుల పండువగా, నగర ప్రజల్లో ఫుల్ జోష్ నింపింది. శోభాయాత్రను డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించగా, అనంతరం తారా ఆర్ట్స్ అకాడమీ, కరీంనగర్ జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోగుల ప్రసాద్, సంగెం రాధాకృష్ణ బృందం చిన్నారులు ముందు రాగా, అండమాన్, ఇజ్రాయిల్, వివిధ రాష్ర్టాల కళాకారులు ర్యాలీగా కళోత్సవ వేదికకు చేరుకున్నారు. ఉత్సవాల ఆఖరు రోజు ఆదివారం కావడం, కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరవడంతో స్టేడియం కిక్కిరిసి పోయింది.
ఎటుచూసినా జనంతోనే కనిపించింది. కాగా, కార్యక్రమాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్ రావు, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపాణి -హరిశంకర్, కలెక్టర్ కర్ణన్, సీపీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్కుమార్ గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమానికి నటుడు శివారెడ్డి, సింగర్లు వొల్లాల వాణి, మధుప్రియ, స్వర్ణ, వందేమాతరం శ్రీనివాస్, వడ్లకొండ అనిల్, వంతడుపుల నాగరాజు, గంగవ్వ, జీల అనిల్, కొమురక్క, బిగ్బాస్ ఫేం సోహెల్ తమ ప్రదర్శనతో సందడి చేశారు. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ.. ‘కేటీఆర్ మహేశ్ బాబు లెక్క ఉన్నడు’ అంటూ పొగిడింది.
సోహెల్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఉన్నా తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే గుర్తొచ్చే నాయకుడు కేటీఆర్ అంటూ ప్రశంసించారు. ‘కేటీఆర్ ఆపిల్ ఫోన్ లెక్క హ్యాండ్సమ్గా ఉన్నడు’ అంటూ పొగిడారు. స్టేడియం మొత్తం ‘తెలంగాణకు రాముడు, కరీంనగర్కు భీముడు’ అంటూ యువత నినదించారు. అయితే గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘ఎర్రజెండ.. ఎర్రజెండ ఎన్నియలో..’ పాటకు స్టేడియం మొత్తం నినాదాలతో హోరెత్తింది. కాగా, చివరి రోజు సాయంత్రం 7:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు ప్రోగ్రామ్స్ సాగగా, మంత్రి కేటీఆర్ దాదాపు మూడున్నర గంటల సేపు ఓపిగ్గా వీక్షించారు.