కరీంనగర్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ‘టీఆర్ఎస్ ఒక పార్టీ కాదు. అది ఒక కుటుం బం. దీనికి పెద్ద కేసీఆర్. అలాంటి కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ఎవరి తరమూ కాదు. పార్టీ కేసీఆర్ను నాయకుడిలా కాకుండా తండ్రిలా భావిస్తుంది. అలాంటి మమ్మల్ని విడదీయడం ఎవరి వల్లా కాదు. కవ్వింపు చర్యలు మానుకోకపోతే ఊరుకోం.
2014కు ముందటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది.’ అని ఏపీ నాయకులను రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వైఎస్ఆర్ కుటుంబంలో ఉడుములా చొచ్చిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తల్లీ కొడుకులు, అన్నా చెల్లెల్లను విడగొట్టి చిచ్చుపెట్టాడని, ఆకలి తీరక ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై పడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో బరాబర్ పాగా వేస్తామని స్పష్టం చేశారు.
కరీంనగర్లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో ఏపీ నాయకులపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ కుటుంబంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంపై ఇప్పటికే కేంద్రం విషం చిమ్ముతున్నదని, ఈ సమయంలో హరీశ్ రావుపై సజ్జల చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ బీజేపీకి బీ టీమ్గా మారినట్లు వెల్లడైందని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు మధ్య సజ్జల చిచ్చుపెట్టాలని చూస్తున్నాడన్నారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఆ ఫ్రస్ట్టేషన్లోనే సజ్జల ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. సజ్జల ఏపీ సీఎం జగన్కు సలహాలివ్వాలి తప్పా తెలంగాణ జోలికి రావద్దని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఏపీ నుంచి తెలంగాణకు పెరుగుతున్న వలసలే జగన్ ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి నిదర్శనమన్నారు. హైదరాబాద్లోని ఆంధ్రావాళ్లని పిలిచి మాట్లాడాలని, వాళ్లు ఎక్కడ ఉండేందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోమని ఏపీ నాయకులకు గంగుల సవాల్ విసిరారు. ఆంధ్రావాళ్లు తెలంగాణలో ఉండేందుకే ఇష్టపడుతున్నారని స్పష్టం చేశారు. హరీశ్ రావు తమ ఆస్తి అని, టీఆర్ఎస్ సోల్జరని, ఆయన కేసీఆర్ను ఎన్నడూ మామ అనలేదని, తండ్రిలా భావిస్తారని పేర్కొన్నారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మా రాష్ట్ర పథకాలు ఉన్నాయని అనడంలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర దేశంలోని అన్ని రాష్ర్టాలు ఇపుడు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమ రాష్ర్టాల్లోనూ అమలు కావాలని ఆకాంక్షిస్తున్నాయని చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టిన తర్వాత ఏపీలో బరాబర్ పాగా వేస్తామని స్పష్టం చేశారు. ఆయా రాష్ర్టాల ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటే ఇక్కడ అమలవుతున్న పథకాలను దేశమంతటా అమలు చేస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వం కరెంట్ మోటర్లకు మీటర్లు పెడతామంటే ఏపీ సీఎం జగన్ ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. మీటర్ల పెట్టకపోతే అప్పులు ఇవ్వమని కేంద్రం బెదిరించినా అదే మా నాయకుడు కేసీఆర్ తెలంగాణలో ఒక్క మోటరుకు కూడా మీటర్ పెట్టనీయ లేదని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్, టీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు చల్ల హరిశంకర్ తదితరులు ఉన్నారు.