వేములవాడ టౌన్, అక్టోబర్ 1 : వేములవాడలో సద్దుల బతుకమ్మ సంబురాలు శనివారం వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను పట్టణంలోని కూడళ్లలో పెట్టి ఆడబిడ్డలు ఆడిపాడారు. అక్కడి నుంచి మూలవాగుకు వెళ్లి ఆడారు. మూలవాగులో ఎటుచూసినా రంగు రంగుల పూలు వికసించాయి. రంగు రంగుల బతుకమ్మలు.. ఆడబిడ్డల ఆటపాటలతో వాగు పరిసర ప్రాంతం జాతరను తలపించింది. బతుకమ్మ ఆడిన అనంతరం మహిళలు అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ తెప్పవద్ద నిమజ్జనం చేశారు.
పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. వేడుకలకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ హాజరయ్యారు. సద్దుల బతుకమ్మ వేడుకలను మెట్టినింట, పుట్టినింట ఆడుకోవడం వేములవాడ ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ ఆడారు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్, ఆసిఫ్నగర్లో సంబురాలు ఘనంగా జరపుకొన్నారు.