సిరిసిల్ల రూరల్, అక్టోబర్1: తెలంగాణ జీవధార మధ్యమానేరు జలాశయం (శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు) కోసం నిర్వాసితులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని, వారికి ఎంత చేసినా తక్కువేనని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు కొనియాడారు. వారి త్యాగాల ఫలితాలను నేడు రాష్ట్ర రైతాంగం అనుభవిస్తున్నదని చెప్పారు. సర్వం త్యాగం చేసిన ఆ నిర్వాసితులకు సీఎం అండగా నిలుస్తున్నారన్నారు.
తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన మధ్యమానేరు నిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారం మంజూరు చేయగా, శనివారం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయ ఆవరణలో పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కొండూరి హాజరై, 103 మందికి 17కోట్ల విలువైన చెక్కులను అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో 2006లో మధ్యమానేరుకు పునాది పడ్డదని, రెండేళ్లకు అంటే 2008లో పూర్తి చేయాల్సి ఉన్నా చేయలేకపోయిందన్నారు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారథ్యంలో మధ్యమానేరు పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు అంటే 2006లో అంచనా వ్యయం 400 కోట్లు అయితే, 15 ఏండ్లు గడిచేసరికి వ్యయం 2వేల కోట్లు దాటిందన్నారు. 2008లోని పిల్లలు నేడు పెద్దగా అయి, వారికి పెండ్లిళ్లు అయి పిల్లలు కూడా పుట్టారన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వాసితులకు సముచిత న్యాయం జరిగిందని, ప్రభుత్వం ప్రతి సమస్యనూ దశలవారీగా పరిష్కరించిందన్నారు. సాంకేతిక కారణాలతో కొంచెం ఆలస్యమైనా ప్రతి నిర్వాసితుడికీ న్యాయం జరిగిందన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 103 మందికి పరిహారం మంజూరైందన్నారు. ఆయన సహృదయుడని, ఎవరు ఏది అడిగినా వెంటనే స్పందించే గుణమున్న నాయకుడని కొనియాడారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సమయం పట్టినా సంబంధించిన అధికారులతో మాట్లాడి ఎట్టకేలకు పరిహారం మంజూరు చేయించడం గొప్పవిషయమని ప్రశంసించారు. అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్డీవో శ్రీనివాసరావు కూడా కృషి చేశారని గుర్తు చేశారు.
అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ న్యాయం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మరో 24 మంది అర్హులకు ఇండ్ల పరిహారం, ఆర్ఆండ్ ఆర్ ప్యాకేజీతోపాటు ఇతర అన్ని రకాల పరిహారం అందేలా చూస్తామన్నారు. ఇంకో 107 మందిలో అర్హులుంటే, వారికి కూడా సాధ్యమైనంత త్వరగా న్యాయం చేస్తామన్నారు. నిర్వాసితుల విషయంలో కూడా రాజకీయాలు చేసే వారున్నారని, అలాంటి వారిని నమ్మి ఆగం వద్దని, ఏ సమస్యలున్నా ప్రభుత్వం లేదా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు మరోసారి ప్రత్యేక ధన్యవాదా లు, కృతజ్ఞతలు తెలిపారు. అప్పటి కలెక్టర్ కృష్ణభాస్కర్, ప్రస్తుత కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంతకుముందు తంగళ్లపల్లి ఎంపీపీ పడిగెల మానస మాట్లాడుతూ, నిర్వాసితులు పరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అమ్మలాంటి బ్యాంకుల్లోనే భద్రపరుచుకోవాలని కోరారు. సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి మాట్లాడుతూ, నిర్వాసితుల త్యాగాలతోనే రైతులకు మేలు జరుగుతున్నదని, వారి త్యాగాలు గొప్పవని కొనియాడారు. అనంతరం చెక్కులు అందుకొన్న నిర్వాసితులు కృతజ్ఞతగా ఆర్డీవో ఆఫీస్ ఆవరణలోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫెక్ల్సీలకు పాలాభిషేకం చేశారు.