కరీంనగర్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ తెలంగాణచౌక్: స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి, సాహసోపేత నిర్ణయాలు తీసుకొని చీకట్లు కమ్ముకున్న కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపారు. ప్రత్యేక పోరాటంలో ఇక్కట్లను ప్రత్యక్షంగా చూసిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేశారు. నాడు బీడీ కార్మికుల పాలిట గుదిబండగా మారిన పుర్రె గుర్తును తొలగింపు ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆయన, వారికి ఆసరా పింఛన్ ఇచ్చి అండగా నిలిచారు. రక్తమాంసాలను ధారపోసి దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికుల వేతనాలు భారీగా పెంచారు. గతంలో ఎన్నడూలేనివిధంగా లాభాల్లో వాటా ఇచ్చారు. కారుణ్య నియామకాలను పునరుద్ధరించారు. నాడు ఆ‘ధారం’ లేక ఆగమైన నేతన్నకు బతుకమ్మ చీరలు, యూనిఫాంలు, జాతీయ జెండాల ఆర్డర్లిచ్చి ఊపిరిలూదారు. ‘చితి’కి పోయిన కుటుంబాలకు రూ. 5లక్షల చేనేత బీమాతో భరోసానిచ్చారు. నిరంతరం చిన్నారులు, గర్భిణులు, బాలింతల సేవలో తరిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తల వేతనాలను మూడు రేట్లు చేశారు.
కరోనా కాలంలో క్లిష్టపరిస్థితుల్లో విధులు నిర్వర్తించిన మున్సిపల్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్తో పాటు భారీగా వేతనాలు పెంచి అండగా నిలిచారు. బస్సు చక్రాన్ని నమ్ముకుని బతుకు బండిని లాగిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తించడమే కాకుండా మహిళా కార్మికులకు నైట్షిఫ్ట్లను తొలగించి వారి కష్టాలను దూరం చేశారు. అడగకముందే సమ్మెకాలానికి సంబంధించి పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించారు. ఇలా ఆయన కార్మిక బంధువుగా నిలిచారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా చేస్తున్న కుట్రలను, ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే తెలంగాణతోపాటు దేశంలోని కార్మికసంఘ నాయకులు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. కార్మికరంగంపై అపార అనుభవమున్న కేసీఆర్ బీజేపీ విధానాలను దీటుగా ఎదుర్కొని తమకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని స్పష్టం చేస్తున్నారు.
కార్మికుడికి కడుపునిండా తిండి..
తెలంగాణ రాక ముందు సింగరేణి కార్మికులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏ ముఖ్యమంత్రి కూడా గోసను వినిపించుకోలేదు. కానీ, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అన్ని రకాలుగా అండగా నిలువడంతో కార్మికకుటుంబాలకు భరోసా దక్కింది. 2014లో ఆయన తీసుకున్న నిర్ణయంతో గతంలో 8 శాతం ఉన్న లాభాల వాటా ఈ ఎనిమిదేండ్లలో 11 శాతమైంది. కార్మికవర్గంపై కేసీఆర్కు ఉన్న ప్రేమ, అభిమానం గౌరవానికి ఇదే నిదర్శనం. సీఎం చొరవతోపాటు సీఎండీ, ఇతర డైరెక్టర్ల నిర్ణయాలతో కార్మికుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. మెడికల్ అన్ఫిట్ల ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులకు వెనువెంటే కొలువులు ఇప్పిస్తున్నారు. కారుణ్య నియామకాలను పెంచారు. నాలుగేండ్లలో 10 వేల వారసత్వ ఉద్యోగాలను ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఇటు సంస్థను లాభాల బాట పట్టించారు. గతంలో 400 కోట్ల లాభాలున్న సింగరేణి సంస్థ, తెలంగాణ వచ్చిన తర్వాత 1700 కోట్ల కంటే ఎక్కువ సాధిస్తున్నది. సంస్థ టర్నోవర్ 12 వేల కోట్ల నుంచి 26 వేల కోట్లకు చేరింది. ప్రొడక్షన్, సేఫ్టీ విషయంలోనూ అభివృద్ధి సాధిస్తున్నది. ఒక్క సింగరేణిలోనే కాదు రాష్ట్రంలోని కార్మిక వర్గాలన్నింటికీ అండగా నిలుస్తున్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే దేశ వ్యాప్తంగా ఉన్న కార్మిక సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మేలు జరుగుతుంది. దేశంలోని ప్రతి పేదోడు, కార్మికుడికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. కేసీఆర్ నిర్ణయాలతో ప్రతి కంపెనీ లాభాల బాటలో పయనిస్తుంది.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి
కార్మికులందరూ హర్షిస్తారు
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సాధించుకున్న ఎన్నో చట్టాలను కేంద్రంలోని బీజేపీ సర్కారు రద్దు చేసింది. కార్మికవర్గానికి వ్యతిరేకంగా ఇంకా ఎన్నో నల్ల చట్టాలను తెచ్చేందుకు కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఎన్నో హక్కులను కాలరాసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి కార్మికులకు అండగా నిలుస్తారనే నమ్మకం మాకున్నది. గత ప్రభుత్వాలుగానీ, ముఖ్యమంత్రులుగానీ కార్మిక వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల కష్టాలు, సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. ఆ అనుభవంతోనే అండగా నిలుస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అట్టడుగున ఉన్న కార్మిక వర్గాన్ని ప్రగతి భవన్కు పిలిచి వారితో కలిసి భోజనాలు చేసి, వారి సమస్యలు పరిష్కరించారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశావర్కర్లు, వీవోఏలు, ఆర్పీలు, మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రోజు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంతో గౌరవంగా బతుకుతున్నారు. సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించడమే కాదు కార్మిక సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు అమలు చేస్తున్నారు. అందుకే దేశంలోని కార్మికులంతా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో కార్మికులను ఆదరించినట్లే తమనుసైతం ఆదరిస్తారని విశ్వసిస్తున్నారు.. పార్టీలు, రాజకీయాలతీతంగా కేసీఆర్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
– ఎల్ రూప్సింగ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకుడు
మెరుగైన ఉపాధి
తెలంగాణలో జిల్లాల ఏర్పాటు తర్వాత అన్ని రంగాల కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. గతంలో కూలీ తక్కువగా ఉండేది. ఈ రోజు చేతినిండా పనిదొరకడమే కాదు, పనికి తగ్గ వేతనం లభిస్తున్నది. భూములకు డిమాండ్ పెరిగి, రియల్ ఎస్టేట్ పుంజుకున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో భవన నిర్మాణ రంగం బలోపేతమైంది. కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ కార్మికులే కాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల నుంచి వందల సంఖ్యలో కార్మికులు ఉపాధి కోసం వలస వస్తున్నారు. అక్కడి రాష్ర్టాల కన్నా ఎక్కువ కూలీ ఇక్కడే లభిస్తుంది. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కూలీలకు చేరుతున్నాయి. ఇదంతా ఆయన చొరవ వల్లే సాధ్యమైంది. దేశ రాజకీయాల్లో నాయకత్వం వహిస్తే ఉపాధి కోసం మన దగ్గరికి వస్తున్న ఇతర రాష్ర్టాల కూలీలకు న్యాయం జరుగుతుంది. దేశంలోని కార్మికులందరికీ ఒకే విధమైన కూలీ అమలు చేసే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ను దేశ్కీ నేతగా మేమంతా గౌరవిస్తున్నాం. కార్మికులమంతా కలిసికట్టుగా ఆయన నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం.
-సామల ప్రవీణ్, సెంట్రింగ్ కార్మిక సంఘం అధ్యక్షుడు (రాజన్నసిరిసిల్ల)
పరిశ్రమలకు మహర్దశ వస్తది
సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమ నిర్వీర్యమైంది. సాంచాలపై ఆధార పడ్డ మా వెల్డింగ్, ఇంజినీరింగ్ దుకాణాలు మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సిరిసిల్లకు వచ్చి ఇక్కడి నేత కార్మికుల దయనీయ దుస్థితిని చూసి చలించిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత వెంటనే చేనేత, మరమగ్గాల అనుబంధ పరిశ్రమలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి జీవం పోశారు. నేత కార్మికులతోపాటు హమాలీలు, గుమాస్తాలు, వైపనీ, కండెలు చుట్టే, ట్రాన్స్పోర్టు, అటో కార్మికులతోపాటు మా వెల్డింగ్ ఇంజినీరింగ్ దుకాణాల్లో పనిచేసే వారందరికీ ఉపాధి లభించింది. ఇదంతా కేసీఆర్ ప్రభుత్వం వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇవ్వడం వల్లే జరిగింది. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు ఆలోచిస్తున్న నాయకుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలకు మహర్దశ వస్తుంది.
– రాజూరి వెంకటేశ్, వెల్డింగ్ ఇంజినీరింగ్ వర్క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు (రాజన్నసిరిసిల్ల)
పారిశ్రామిక రంగం పరుగులు పెడుతది..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్న మైంది. కేంద్రం అస్తవ్యస్త విధానా లతో ప్రభుత్వరంగ పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నది. బంధుప్రీతి తో కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నది. భవిష్యత్లో ప్రభుత్వ పరిశ్రమలు మూతపడి ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రశ్నా ర్థకమయ్యే పరిస్థితి. సింగరేణి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటది. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెడితే పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నది.
నిరుద్యోగం లేని దేశాన్ని చూస్తాం..
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే నిరుద్యోగం, పేదరికం లేని దేశాన్ని చూస్తాం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించా క కేసీఆర్ స్థానంలో సీఎంగా మరొకరు ఉంటే రాష్ట్రం ఇం తగా అభివృద్ధి చెందేది కాదు. ఆయన హయాంలోనే దేశం లో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రధానంగా కార్మిక రంగానికి మేలు చేస్తున్నారు. సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకవచ్చిన విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటు సెక్టార్లుగా మారుస్తున్నది. కేసీఆర్ దేశ ప్రధాని అయితే మళ్లీ ఆ ప్రైవేటు సెక్టార్లను రద్దు చేసి ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా మార్చే సత్తా ఉందని భావిస్తున్నా. నిరుద్యోగ సమస్య ఉండదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
– మద్దెల శ్రీనివాస్, తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షుడు (గోదావరిఖని)
దేశ వ్యాప్తంగా అమలవుతాయి
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రధాని అయితే మన రాష్ట్రంలో నిరుపేదలకు ఇచ్చే పథకాలు దేశ వ్యాప్తంగా అమలవుతాయి. పేదలకు అందిస్తున్న పింఛన్లు దేశవ్యాప్తంగా అందుతాయి. కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు దేశ వ్యాప్తంగా కడితే రైతులకు స్వర్గసీమ అవుతుంది. ఇక్కడ ఇస్తున్న కూలి అధికంగా ఉండడంతో పక్క రాష్ర్టాలైన ఒడిశా, బీహార్ నుంచి కార్మికులు పని చేయడానికి వస్తున్నారు. ఇక్కడి పథకాలను పక్క రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయంటే కేసీఆర్ ఆలోచనా విధానం జాతీయ స్థాయిలో ఉందని అర్థమవుతున్నది.
– సాయిల్ల కొమురయ్య, హమాలీ సంఘం అధ్యక్షుడు(జగిత్యాల)
ఆటో కార్మికుల దేవుడు..
ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులకు బీమా, రైతుబంధు, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నేత, గీత, బీడీ కార్మికులకు అత్యధికంగా పింఛన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అలాంటి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లి, దేశ ప్రధాని అయితే నిరుపేదలకు అన్ని సదుపాయాలు అందేలా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశ వ్యాప్తంగా ఉంటే రైతులు, కార్మికులకు మంచి రోజులు వచ్చినట్టే. టాక్స్ మాఫీ చేసి రాష్ట్రంలో ఆటో కార్మికులకు దేవుడయ్యారు. అలాంటి నేత దేశ వ్యాప్తంగా సేవలందించాలి.
– తొలిప్రేమ శ్రీనివాస్, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు (జగిత్యాల)
గర్వించేలా పాలన
సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ర్టాన్ని పాలిస్తున్నారు. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే నంబర్వన్గా నిలబెట్టారు. సు దీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆ యన దేశ రాజకీయాల్లోకి వెళ్లాలి. పక్క రాష్ర్టాల్లోనూ మాకు కేసీఆర్ వంటి సీఎం ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. కొన్ని రోజుల కిందట మహారాష్ట్ర కార్మికులు నాతో ఇవే మాటలు చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్తోనే కార్మికులకు మంచి జరుగుతది.
– బర్ల లక్ష్మణ్, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు, మెట్పల్లి