కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 30: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో కళోత్సవం అదిరింది. మూడు రోజులపాటు ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించనుండగా, శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా వచ్చారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్ రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిప్యూటీ కలెక్టర్లు శ్యాంప్రసాద్లాల్, గరిమా అగర్వాల్తో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నిమిషాల పాటు సాగిన క్రాకర్ షో జిల్లా వాసులను కనువిందు చేసింది. కాగా, అంతకుముందు ఓల్లాల వాణి ఆలపించిన ‘ఏ పిల్లా పిల్లాడో..’ అంటూ సీఎం కేసీఆర్ రాష్ర్టానికి చేసిన సేవలను కీర్తించగా, తెలంగాణ ఫేమ్ శివజ్యోతి(సావిత్రి) సభను ప్రారంభించారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు కళాకారులు మిట్టపల్లి సురేందర్, మధుప్రియ, మౌనిక యాదవ్, బుల్లెట్ భాస్కర్, నరేశ్, జోగుల వెంకటేశ్, శ్రీకాంత్, చంద్రవ్వ, కొమురవ్వలను పరిచయం చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన సంగెం రాధాకృష్ణ బృందం చేసిన కార్యక్రమ ప్రారంభ నృత్యం అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో సినీ తారలు తరుణ్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం ఇజ్రాయిల్, అండమాన్ నికోబార్కు చెందిన కళాకారుల నృత్యాలు అలరించాయి. కాగా, వేడుకలను ఒకేసారి 20 వేల మందికి పైగా వీక్షించేలా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. రెండ్రోజుల క్రితమే మూడు దేశాలు, 20 రాష్ర్టాల నుంచి కళాకారులు నగరానికి చేరుకోగా, వారి కోసం ప్రత్యేకంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు.