సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 30: సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ పవర్ లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ హామీ ఇచ్చారు. టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను అప్గ్రేడ్ చేసేందుకు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా ఉన్నారని, వారికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్లో డెవలప్మెంట్ కమిటీ, పరిశ్రమల యజమానులతో శుక్రవారం సమావేశమయ్యారు. మొదట ప్రవీణ్ను టెక్స్టైల్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్కుమార్, పరిశ్రమల యాజమానులు, సభ్యులు ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, కార్మికుల జీవనవిధానం, సమస్యలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు సంపూర్ణ అవగాహన ఉన్నదని చెప్పారు. స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ నేత కార్మికులకు ఎనలేని సేవలందించారని కొనియాడారు. చేతినిండా పనికల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరెలు, యూనిఫాంలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు సిరిసిల్ల కార్మికులకు ఇచ్చారని గుర్తు చేశారు. సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పనులకు రూ.18 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇంకా పార్క్లో ఎన్వోసీ, విద్యుత్ ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా ఉన్నారన్నారు. సమావేశంలో డీడీ అశోక్రావు, ఏడీ సాగర్, కిరణ్, యెల్లె లక్ష్మీనారాయణ, మొండయ్య, వాసం శ్రీనివాస్, వేణు ప్రసాద్ ఉన్నారు.