నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 27 : కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని, ఆయన జీవితం పలువురికి ఆదర్శమని నేతలు కొనియాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరు బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సేవలను కొనియాడారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మేయర్ యాదగిరి సునీల్రావు, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు, అధికారులు లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి, హైదరాబాద్ రోడ్డులోని బైపాస్ రోడ్డులో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి, కరీంనగర్లోని ఉజ్వల పార్కు సమీపంలో గల బాపూజీ విగ్రహానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపూజీ తుది శ్వాస విడిచేంత వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడారన్నారు.
బీసీల అభ్యున్నతి కోసం చట్టసభల్లో గొంతెత్తి పోరాడిన మహనీయుడని కొనియాడారు. జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్ నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ రవి పాల్గొని నివాళులర్పించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, అదనపు కలెక్టర్ వీ లక్ష్మీనారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. గోదావరిఖని మార్కండేయ కాలనీ చౌరస్తాలో పద్మశాలీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.