ఆడబిడ్డలంటే మీకు అంత చులకనా..?
మన సంక్షేమ పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా..?
బీజేపీ పాలితరాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదు
ఆడబిడ్డల సంతోషమే సీఎం కేసీఆర్ లక్ష్యం
ప్రకృతిని పూజించడం తెలంగాణ సంస్కృతి
మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్లో బతుకమ్మ చీరల పంపిణీ
కార్పొరేషన్, సెప్టెంబర్ 23: ఆడబిడ్డల మోముల్లో నవ్వులు చూడడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిలోనూ వారికే ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రకృతిని పూజించే గొప్ప సంసృతి ఒక్క తెలంగాణలోనే ఉందని, మహిళలంతా సంతోషంగా పండుగ జరుపుకోవాలన్న ఆలోచనతో బతుకమ్మ చీరెలను అందిస్తున్నదని చెప్పారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం ఆ చీరలపైనా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగరంలోని రాంనగర్ మహిళా సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 16, 37, 38 డివిజన్లకు సంబంధించిన మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నదని, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటివి ఎన్నో అమలు చేస్తున్నదని చెప్పారు.
అర్హులందరికీ కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందన్నారు. బీజేపీ పా లిత రాష్ర్టాలు, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇప్పటికీ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటు వంటి పథకాలు ఇంకెక్కడైనా ఉన్నాయా..? కేసీఆర్ సీఎం కాకపోతే ఈ పథకాలన్నీ రాష్ట్రంలో అమలయ్యేవా..? ఇంత అభివృద్ధి జరిగేదా..? అని ప్రశ్నించారు.
గతంలో 70 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ పాలనను చూశామని, అప్పుడు ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తారని, ఉన్న రోడ్లను తవ్వడం తప్ప అభివృద్ధి చేసేదేమీ ఉండదని విమర్శించారు. సీఎం కేసీఆర్కు మహిళలంతా అండగా నిలువాలని, సంక్షేమ పట్టని నాయకులకు ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడు తూ, ఈ నెల 25 నుంచి జిల్లాలో ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తామన్నా. రోజుకో శాఖ బతుకమ్మ నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొటర్ బోనాల శ్రీకాంత్, గుగ్గిళ్ల జయశ్రీ, కో ఆప్షన్ మెంబర్ నందెళ్లి రమ, టీఆర్ఎస్ నాయకులు హరీశ్, అరె రవి, మురళి, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.