చందుర్తి (రుద్రంగి), జనవరి 28: ఆంగ్ల విద్య బోధన లేక.. పిల్లలు రాక మర్రిగడ్డలోని ప్రాథమిక పాఠశాల 2017లో మూతపడ్డది. దాంతో అక్కడి తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రైవేటు స్కూళ్లకు పంపించలేక.. ఆర్థికంగా ఇక్కట్లు పడ్డారు. వర్షాకాలంలోనైతే వారి సమస్యలు వర్ణణాతీతం. వీటన్నింటినీ గమనించిన స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు బడిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు అనుమతి సాధించారు. 2021 సంవత్సరంలో పాఠశాలను 15 మంది విద్యార్థులతో పునః ప్రారంభించారు. తమ వీధిలోని సర్కారుబడిలో ఇంగ్లిష్ మీడియంలో చదువు చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపగా ఈ యేడాది విద్యార్థుల సంఖ్య ఏకంగా 66 మందికి చేరింది. గ్రామంలోనే పిల్లలు ఆంగ్ల విద్య చదువుతుండడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు, యూనిఫాంలతో పాటు నాణ్యమైన మధ్యాహ్నభోజనం పెడుతుండడంతో సంబురపడుతున్నారు. బుక్స్, యూనిఫాం, ట్రాన్స్పోర్టు ఖర్చులు తప్పాయని, తమపై ఆర్థికభారం తగ్గిందని చెబుతున్నారు. అలాగే గ్రామానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు బండ నర్సయ్య-చంద్రకళ విద్యార్థులకు రూ. 20 వేల విలువైన ఇంగ్లిష్ బుక్స్ అందించారు. తల్లిదండ్రులు సైతం తలాకొంతపోగు చేసుకొని ఇద్దరు ప్రైవేట్ టీచర్లను నియమించుకున్నారు.
‘మన ఊరు-మన బడి’తో మరింత బలోపేతం
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ప్రారంభించనున్న ‘మన ఊరు-మన బడి’తో ఈ స్కూల్ మరింత బలోపేతమవుతుందని గ్రామస్తులు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. స్కూల్లో అన్ని వసతులు సమకూరుతాయని పేర్కొంటున్నారు. అంతేకాకుండా మరో ఇద్దరు ఉపాధ్యాయులు ఈ స్కూల్కు వచ్చే అవకాశముంటుందన్నారు. తద్వారా విద్యార్థులకు మెరుగైన ఆంగ్లవిద్య అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది 150 మంది విద్యార్థులు కొత్తగా చేరే అవకాశమున్నదని చెబుతున్నారు.
ఆడ్మిషన్లు భారీగా పెరుగుతాయి..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మన ఊరు.. మన బడితో ప్రభుత్వ పాఠశాలలు మరింత పటిష్టం అవుతాయి. గ్రామస్తుల సహకారంతోనే మర్రిగడ్డ పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రైవేట్కు దీటుగా వసతులు కల్పిస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరం భారీగా అడ్మిషన్లు పెరిగే అవకాశమున్నది.
అందరి సహకారంతోనే సాధ్యమైంది..
ఉపాధ్యాయులు, గ్రామస్తుల సహకారంతోనే పాఠశాలను తిరిగి ప్రారంభించుకున్నాం. పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో బోధించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే ఏడాది మన ఊరు మన బడి కార్యక్రమంతో పాఠశాలలో బెంచీలు, ఆదనపు గదులు, నీటి వసతి వంటి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.