తెలంగాణ చౌక్, సెప్టెంబర్ 23 : చిన్నపిల్లలు, గర్భిణులతో పాటు పాటు ప్రతి ఒక్కరూ పోషక విలువలు గల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే వ్యాధులు దూరమవుతాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు ప్రాంగణంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్పర్సన్ కళతో కలిసి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులు మిల్లెట్ ఫుడ్ ప్రాధాన్యత ప్రదర్శించిన నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం మాట్లాడుతూ బాలికలు, మహిళలు అధిక రక్తహీనతకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలో దానిని నివారించే దిశగా చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి అందరికీ తెలిసేలా మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, దీనిని విజయంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిన్నపిల్లల ఆహారపు అలవాట్లలో మిల్లెట్ అవసరం తెలియజేసే దిశగా సానుకూల మార్పులు రావడం గొప్ప విషయమని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో మాదిరిగానే అన్ని మండల కేంద్రాల్లోనూ వీటిని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
దినచర్యలో భాగం చేసుకోవాలి : కలెక్టర్
మిల్లెట్ ఫుడ్ను ప్రతి ఒక్కరూ రోజూ తీసుకునే ఆహారంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. పోషణ్ అభియాన్ మాసంలో భాగంగా ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో మిల్లెట్ ఫుడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమ స్ఫూర్తితో మిల్లెట్ ఫుట్ ప్రాధాన్యతను ప్రతి గడపకూ తెలిసేలా కృషి చేయాలని సూచించారు.
రుచికరమై వంటకాల ప్రదర్శన
మిల్లెట్ ఫెస్టివల్లో పట్టణ పరిధిలోని సుమారు 15కి పైగా పాఠశాలల విద్యార్థులు వారు స్వయంగా తయారు చేసిన పోషక విలువలున్న వంటకాలను ప్రదర్శించారు. పలువురు ప్రజాప్రతినిధులు వాటిని రుచి చూస్తూ ఆయా పదార్థాల్లోని పోషకాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈవో రాధాకిషన్, హెచ్ఎంలు భాగ్యరేఖ, చకినాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు భూపాల్రెడ్డి, దేవయ్య, కేజీబీవీల ఎస్వోలు, తదితరులు పాల్గొన్నారు.