వీణవంక, సెస్టెంబర్ 22: సీసీ కెమెరాలు భద్రతకు భరోసా కల్పిస్తాయని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి తెలిపారు. కిష్టంపేటకు చెందిన గూడ రాజయ్య తన తల్లిదండ్రులు గూడ వజ్రమ్మ-పాపయ్య జ్ఞాపకార్థం అందజేసిన 16 సీసీ కెమెరాలను ఎస్ఐ శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా గురువారం ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో వీలైనన్ని ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అనుకోని ఘటనలు జరిగినపుడు సీసీ కెమెరాలతో గుర్తించి సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. ఇండ్లలో సైతం తక్కువ ఖర్చుతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకురావాలని కోరారు. గ్రామంలోకి అపరిచితులు వచ్చినా, అర్ధరాత్రి ప్రమాదాలు, దొంగతనాలు జరిగినా నిఘా కెమెరాలతో వెంటనే దోషులను గుర్తించవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఆదర్శ మండలంగా నిలుపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జమ్మికుంట రూరల్ సీఐ సురేశ్, సర్పంచ్ బండారి ముత్తయ్య, ఉపసర్పంచ్ అప్పాల శంకర్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.