చొప్పదండి, సెప్టెంబర్ 22: ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని చెప్పారు. వారి అభ్యున్నతికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. చొప్పదండి వరలక్ష్మి ఫంక్షన్హాల్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణ సర్కారు అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమని అభివర్ణించారు. కార్యక్రమంలో ఎంపీపీ చిలుకరవీందర్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్కుమార్, బల్దియా చైర్పర్సన్ గుర్రం నీరజ తదితరులు పాల్గొన్నారు.
చీరలు బాగున్నాయి
బతుకమ్మ పండగను పురస్కరించుకుని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరెలు బాగున్నాయి. పెద్ద పండగ అయిన బతకమ్మ పండగ గురించి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. మాకు పంపిణీ చేసిన చీరెలను కట్టుకుని బతుకమ్మ వేడుకల్లో ఆడిపాడుతం.
– పోరండ్ల లక్ష్మి,కోనేరుపల్లి